నందికొండ, మే 6 : నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాల్వ పటిష్టంగా, ఊట నీరు రాకుండా ఉండేందుకు పొట్టి చెల్మ సమీపంలో ఎడమ కాల్వ సొరంగ మార్గం తవ్వినప్పుడు వచ్చిన మట్టి, రాళ్లను కాల్వ కట్టపై పోశారు. ఈ మట్టి, రాళ్లపై అక్రమార్కుల కన్ను పడింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులకు కాసుల పంట పండుతోంది. పొట్టి చెల్మ సమీపంలో ఎడమ కాల్వ మీదుగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. విద్యుత్తు కేంద్రం వద్ద జెన్కో ఎస్పీఎఫ్ పహారా చేపడుతుంది. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వెంట ఎడమ కాల్వ మట్టికట్ట వద్దకు పోయేందుకు ట్రాక్టర్ల డ్రైవర్లు ఫారెస్టు నుంచి రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ మార్గం ద్వారా వెళ్లేందుకు మట్టి, రాళ్లను తరలించేందుకు జెన్కో ఎస్పీఎఫ్ అధికారులకు ప్రతి నెలా మామూళ్లు ఇస్తున్నామని ట్రాక్టర్ల డ్రైవర్లు చెప్పుతున్నారు. జెన్కో ఎస్పీఎఫ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా కాల్వకు పోసిన మట్టి, రాళ్లను రాత్రి పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. ఉదయం సమయంలో మట్టిని ఇండ్ల నిర్మాణాలకు తరలిస్తుండగా, రాళ్ళను రాత్రి సమయాలలో సమీపంలోని కంకర మిల్లులకు తరలిస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం ఎన్ఎస్పీ, ఫారెస్టు అధికారులు పర్యవేక్షణ కొరవడిన కారణంగానే కాల్వ కట్ట మట్టి, రాళ్లు తరలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ..
నాగార్జున సాగర్ డ్యాం ఎన్ఎస్పీ, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణా లోపంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఎడమకాల్వకు పోసిన మటి,్ట రాళ్లను తరలించకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాల్వ పటిష్టతకు వేసిన మట్టి, రాళ్లు తొలగిస్తే, డ్యాం పూర్తి స్థాయిలో 590 అడుగులకు చేరినప్పుడు కాల్వ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫారెస్టు నుంచి రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకొని మట్టి, రాళ్లను తరలిస్తున్న, ట్రాక్టర్లు కార్యాలయం ముందు నుంచే పోతు న్నా ఫారెస్టు అధికారులు పట్టించకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. కాల్వ కట్ట మట్టి, రాళ్లు తరలించే వారిని, అందుకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై జెన్కో ఆర్ఐ ప్రతాప్ నాయుడును వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి, ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామన్నారు.
ప్రతినెలా మామూళ్లు ఇవ్వాల్సిందే
ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలి. మామూళ్లు ఇస్తే మాకు ఎవరు అడ్డు రారు. ఎవరైనా అధికారులు వస్తే మాకు సమాచారం ఇస్తారు ఆ రోజు వెళ్ళం. రాత్రి 11 గం నుంచి ఉదయం 3 గం వరకు మట్టి, రాళ్లను తోలుకోవాలి, వాళ్ల సిబ్బందికి పార్టీలు ఇవ్వాలి. నేరుగా ఎస్పీఎఫ్ కార్యాలయం వద్దకు డ్రైవర్లను పిలిపించి, అధికారులు మాతో మాట్లాడి మామూళ్లు తీసుకుంటున్నారు.
-ట్రాక్టర్ డ్రైవర్లు