నేరేడుచర్ల, ఆగస్టు 24 : ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ నేరేడుచర్లకు చెందిన తైక్వాండో క్రీడాకారుడు కొణతం గమన్ రెడ్డి సత్తా చాటాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 21 నుండి 23 వరకు నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోటీల్లో 12 దేశాలు, 22 రాష్ట్రాల నుండి దాదాపు 1,897 క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీ అనంతరం తైక్వాండో డాన్-9 గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి చేతుల మీదుగా గమన్రెడ్డి ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు.
గమన్రెడ్డి హైదారబాద్లోని స్కాలర్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. కోచ్ సైకం సుబ్బారావు ఆధ్వర్యంలోని SITS సంస్థలో గత నాలుగేళ్లుగా తైక్వాండోలో శిక్షణ పొందుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం విశేషం. ఈ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ తుదిదశలో భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల క్రీడాకారుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగగా గమన్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ తాజా విజయంతో గమన్ రెడ్డి సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు ఉన్నాయి. గమన్రెడ్డి విజయంపై అతడి కుటుంబ సభ్యులు, నేరేడుచర్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో నేరేడుచర్ల చిన్నారి గమన్ రెడ్డికి బంగారు పతకం