ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు శనివారం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం బ్రోచర్ను ఆవిష్కరించారు. మధ్యాహ్నం నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు.
నల్లగొండ సిటీ, డిసెంబర్ 9: మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ పథకాన్ని శనివారం నల్లగొండ డిపోలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డిపో మేనేజర్ రామ్మోహన్రెడ్డి, డీఎంఓ మాధవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మిర్యాలగూడటౌన్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే పథకాన్ని మిర్యాలగూడ డిపోలో ఏడీఏ పోరెడ్డి నాగమణి, డీఎస్పీ వెంకటగిరి, ఆర్టీసీ డిపోమేనేజర్ పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం పాల్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం మిర్యాలగూడ నుంచి నల్లగొండకు వెళ్లే పల్లెవెలుగు బస్సులో మహిళలకు జీరో టికెట్ అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, టుటౌన్ సీఐ నరసింహారావు, ఎస్ఐలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
నార్కట్పల్లి : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని శనివారం నార్కట్పల్లి డిపోలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ప్రత్యేకంగా మహిళలతో కూడిన బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిపో అధికారులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
హాలియా : స్థానిక బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కుందూరు వెంకట్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు కాకునూరి నారాయణగౌడ్, మల్గిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శ్రీనివాస్, రావుల రాంబాబు పాల్గొన్నారు.