నల్లగొండ ప్రతినిధి, జనవరి11(నమస్తే తెలంగాణ) : పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉచిత బియ్యం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. రేషన్ పంపిణీ ప్రక్రియలోని సాంకేతికతను ఆధునీకరించడం(సాఫ్ట్వేర్ అప్డేటేషన్)లో కొంత జాప్యం జరిగినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఆలస్యంగా ప్రారంభించినందుకు గాను ఈ నెల 30 వరకు పంపిణీకి గడువును పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో జనవరి నెలకు మొత్తం 16,380.985 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని పేదలకు అందజేయనున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉచిత బియ్యం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత వరకు సంక్రాంతి లోపే దీన్ని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు 2021 మే నుంచి నిరాటంకంగా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుండడం విశేషం.
నిరాటంకంగా బియ్యం పంపిణీ
సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కరోనా కాలంలో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు కిలో రూపాయి చొప్పున ఇస్తున్న బియ్యాన్ని ఉచితంగా మార్చేశారు. దాంతో 2021 మే నుంచి నేటి వరకు ఉచిత బియ్యం పంపిణీ నిరాటకంగా కొనసాగుతున్నది. రేషన్ కార్డులో నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ప్రస్తుత నెలలోనూ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచే ఇది ప్రారంభం కావాల్సి ఉండగా సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. సాంకేతికంగా అప్గ్రేడ్ చేశాక బుధవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వెనువెంటనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బియ్యం పంపిణీని షురూ చేశారు. జిల్లా పౌరసరఫ
రాల శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి బుధవారమే మెజార్టీ రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ప్రజలకు అందేలా చర్యలు చేపట్టారు. రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అంతమందికి బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం నుంచి ఈ నెల 30 వరకు బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కానీ, సంక్రాంతి పండుగ లోపే సాధ్యమైనంత ఎక్కువ మందికి బియ్యం అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.
బుధవార పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ రేషన్ పంపిణీని పర్యవేక్షించారు. పండుగ లోపు ఎక్కువ మందికి అందజేసేలా చూడాలని ఆదేశించారు. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకే పంపిణీ పూర్తి చేస్తుంటారు. కానీ, సాంకేతిక కారణాలతో జాప్యం నెలకొనడంతో పంపిణీ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ నెలతోపాటు ఫిబ్రవరి, మార్చి వరకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి యథావిధిగా ఆరు కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది.
ఉచిత బియ్యం పంపిణీపై లబ్ధిదారులను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వాస్తవంగా 2021మే నుంచి డిసెంబర్ 2022 వరకు కార్డులోని ఒక్కో వ్యక్తికి పది కిలోల చొప్పున మొత్తం 200 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 203 కేజీలను అందజేశారు. 2021మే, 2022 మే, జూన్ నెలల్లో అదనంగా ఒక్కో కిలో చొప్పున అందజేయడంతో ఈ మూడు కిలోలను ప్రస్తుత జనవరి నుంచి మార్చి వరకు సర్దుబాటు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. రెగ్యులర్గా ఇచ్చే బియ్యంలో ఎలాంటి కోత లేదని, ప్రస్తుతం సర్దుబాటేనని, ఏప్రిల్ నుంచి యథావిధిగా ఆరు కిలోల చొప్పున ఉచిత బియ్యం పేదలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా ఇలా..
సాధారణ రేషన్ కార్డులోని ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10కిలోల చొప్పున ప్రస్తుతం ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16,380.985 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జనవరిలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 4,66,939 కార్డులకు 7,665.635 మెట్రిక్ టన్నులు, సూర్యాపేట జిల్లాలో 3,24,624 కార్డులకు 5,105.730మెట్రిక్ టన్నులు, యాదాద్రి జిల్లాలో 2,17,108 కార్డులకు 3,609.620 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేయనున్నారు. ఇప్పటికే ఈ బియ్యాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలకు చేరవేశారు.
ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం
బుధవారం ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించాం. తొలిరోజే జిల్లాలో 450 దుకాణాల్లో రేషన్ పంపిణీ మొదలైంది. సాఫ్ట్వేర్లో సమస్యల కారణంగా కొంత ఆలస్యమైంది. పంపిణీకి ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాల్లోనూ ఉచితబియ్యం అందుబాటులో ఉంచాం. సంక్రాంతి పండుగ నాటికే వీలైనంత ఎక్కువ మందికి అందజేయాలని ప్లాన్ చేశాం. ఈ మేరకు క్షేత్రస్థాయిలోనూ పర్యవేక్షణ చేస్తున్నాం.
-వి.వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ