PV Narasimha Rao | తెలుగు నేల నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మాజీ ప్రధాన మంత్రి, బహుభాషావేత్త పాములపర్తి వెంకటనర్సింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగు జిల్లా వరంగల్ జిలాలో పుట్టిన పీవీ నర్సింహారావుకు నాటి నీలగిరిగా ఉన్న నేటి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో విడదీయరాని అనుబంధమే ఉన్నది. పీవీ ఆలోచనతో మొగ్గ తొడిగిన గురుకుల విద్యకు నల్లగొండ జిల్లా నుంచే నాంది పలికారు. సర్వేల్ గురుకుల పాఠశాలను పీవీ స్వయంగా ప్రారంభించడం చరిత్రలో మరుపురాని ఘట్టం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో రాజకీయ దురంధరుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సామాజికంగా, రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులతోపాటు భూదానోద్యమ నేతలు, జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలతో మంచి అనుబంధమే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే కాంచనపల్లి చినవెంకటరామారావు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పులిజాల రంగారావు లాంటి వారితో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఇక జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న చకిలం శ్రీనివాసరావుతో తొలినాళ్లలో రాజకీయంగా ఏర్పడిన అనుబంధం… ఆత్మీయంగా మారి చివరి వరకు కొనసాగింది.
ఈ నేపథ్యంలోనే చకిలం శ్రీనివాసరావు మృతి అనంతరం నల్లగొండలో 1998 జూలై 18వ తేదీన జరిగిన చకిలం విగ్రహావిష్కరణకు మాజీ ప్రధాని హోదాలో పీవీ నర్సింహారావు హాజరయ్యారు. పీవీ వస్తున్నాడని తెలిసి వేలాది మంది ప్రజలు ఆ సభకు తరలిరావడం అప్పట్లో విశేషంగా మారింది. అదే రోజు తన ఆత్మీయులుగా ఉన్న పులిజాల రంగారావు ఇంటికి పీవీ వెళ్లి పలుకరించి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారన్న చర్చ వినిపించింది. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, పాల్వాయి గోవర్ధన్రెడ్డి లాంటి సీనియర్ నేతలు పీవీ నర్సింహారావుతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తానే స్వయంగా తీర్మానం ప్రవేశపెడుతూ భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి పంపించారు. ఎట్టకేలకు పీవీకి భారతరత్న ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పీవీకి భారతరత్నపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో జన్మించిన పీవీకి దక్కిన గౌరవం యావత్ తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
స్వతహాగానే విద్యాధికుడు అయిన పీవీ నర్సింహారావు విద్య అందరికీ అందాలన్న ఉన్నత ఆశయంతో గురుకుల విద్యకు శ్రీకారం చుట్టారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో మొట్టమొదటి గురుకులాన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నర్సింహారావు 1971 నవంబర్లో తన స్వయంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి అనేక గురుకులాలతో బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టారు. ఆ తర్వాత గురుకులాల స్ఫూర్తి దేశవ్యాప్తంగా పాకింది. పీవీ నర్సింహారావు ఆలోచన దేశానికి ఆదర్శంగా నిలిచిందనడంలో సందేహం లేదు.