నల్లగొండ రూరల్, డిసెంబర్ 13 : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి(65) అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. రుద్రమదేవి మృతి పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నల్లగొండలోని రుద్రమదేవి నివాసంలో ఆమె పార్థివ దేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు నల్లగొండ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రుద్రమదేవి 20 ఏండ్లకే నల్లగొండ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలుపొందారు. 1981లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపిం చి నల్లగొండకు వచ్చిన సమయంలో ఆమె ఆ పార్టీలో చేరారు. 1985లో నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఎన్టీఆర్ రాజీనామా చేయ గా.. అక్కడి నుంచి రుద్రమదేవి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో రుద్రమదేవి ఒకరు. చాలా కాలంపాటు టీడీపీలో పని చేసిన ఆమె అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రుద్రమదేవి మృతదేహం వద్ద నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్చైర్మన్ అబ్బగోని రమేశ్, నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ,కౌన్సిలర్లు యామ కవితాదయాకర్, పిల్లి రామరాజు, నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, లోడంగి గోవర్ధన్, జనార్దన్రావు, రావుల శ్రీనివాస్రెడ్డి, కందుల లక్ష్మయ్య, నారగోని నర్సింహ, జానయ్య బంధువులు ఉన్నారు.