హాలియా, ఏప్రిల్ 6 : ఈ యాసంగిలో పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీకోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శనివారం హాలియాలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలోని రైతాంగాన్ని, నిరుద్యోగులను, మహిళలను, యువతను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టిందన్నారు. కానీ, అధికారంలోనికి వచ్చాక ఏ ఒక్క హామీని అమలుచేయడం లేదని విమర్శించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీతోపాటు ఎకరాకు 15 వేల చొప్పున ఇస్తామన్న రైతుబరోసా, క్వింటాకు 500 బోనస్, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఇస్తామని ఇప్పటికీ ఇవ్వ డం లేదన్నారు. నిరుద్యోగ భృతి అట్టకెక్కిందన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116తోపాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ధగా చేసిందని విమర్శించారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పెద్ద దద్దమ్మగా పేర్కొన్నారు. ఆయనది ఉమ్మడి నల్లగొండ జిల్లా అయినప్పటికీ జిల్లాలో సాగునీరు లేక లక్షలాది ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ ఆయనలో మాత్రం చలనం లేదన్నారు. తాగునీటి పేరుతో ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్కు నీళ్లు తీసుకెళ్తున్నారని, పక్కనే ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని చెరువులను మాత్రం నింపడం లేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించార ఉ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, పెద్దవూర ఎంపీపీ సలహాదారు చెన్ను సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, రవినాయక్, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, మాజీ ఎంపీపీలు అనుముల ఏడుకొండల్, అల్లి పెద్దిరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, నాయకులు అనుముల శ్రీనివాస్రెడ్డి, రాజారాంసింగ్, సతీశ్రెడ్డి, లింగయ్య, వెంకన్న, లక్ష్మణ్యాదవ్, రవినాయక్, ఆంజనేయులు, రాంబా బు, సైదాచారి, వెంకటయ్య పాల్గొన్నారు.