మిర్యాలగూడ, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం రెండు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, వెలువడిన ఫలితాల నేపథ్యంలో ప్రజా తీర్పును శిరసా వహిస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. గెలుపోటములు సహజమని, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేద ని, తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
గడిచిన పది సంవత్సరాల కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు 2014, 2018 ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య యుతంగా జరిగే ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఓర్పుతో ఉండాలని, గతంలో లాగానే ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను చేసే సేవలు ఆగవని, ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని పేర్కొన్నారు.