సంస్థాన్ నారాయణపురం,మే 9 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని సర్వేల్, నారాయణపురం గ్రామాల్లో పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ నెల రోజుల క్రితం తెచ్చిన పంటను కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, ఇది రైతులు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అరిగోస పడుతున్నారన్నారు.
ఎలాంటి ఆంక్షల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. పది రోజుల్లో ధాన్యం కేంద్రాల్లో ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఐదువేల మంది రైతులతో కలిసి ధర్నా చేస్తామని కూసుకుంట్ల హెచ్చరించారు. పంటలను కొనుగొలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం.. రైతు వారోత్సవాల పేరుతో సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్రి నరసింహ, నలపరాజు స్వామి,లారీ భిక్షం, తెలంగాణ బిక్షం, జక్కిడి యాదిరెడ్డి, వడ్డేపల్లి రాములు, దోటి జంగయ్య, ఈసం యాదయ్య, కట్టెల భిక్షపతి, యాది రెడ్డి, దోనూరి శేఖర్ రెడ్డి, బీరయ్య,జినుకుల కిరణ్, నలపరాజు రమేష్, తిరుమలేష్, తరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.