ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 20 : రాష్ట్రంలో రేవంత్రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ మోసపోతే గోసపడుతామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని తిమ్మాపురం ఎక్స్రోడ్డు నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు 2కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, కోలాటం, ఒగ్గు కళాకారుల ఆటపాటలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాగు, సాగునీటి కష్టాలు వచ్చాయన్నారు. హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్రెడ్డి పూటకో మాట చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందాయని, నేటి కాంగ్రెస్ పాలనలో అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను అధిక మెజార్టీతో గెలిపించి మాట తప్పిన కాంగ్రెస్ను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు.
అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్గౌడ్, తొట్ల స్వామి, మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, ఎంపీటీసీ యాస కవిత, నాయకులు వెంకటేశ్గౌడ్, భిక్షపతి, ఇంద్రారెడ్డి, ఉప్పలయ్య, రమేశ్, అరుణ, ధనలక్ష్మి, వెంకన్న, అంజిరెడ్డి, రాజు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేస్తా. 38 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉన్నది. కేసీఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంఠక పాలన సాగిస్తున్నది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రజలంతా ఓటు వేసి నన్ను గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపిస్తా.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి
పార్లమెంటు ఎన్నికల్లో మోసకారి కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి. బడుగు, బలహీన వర్గాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టారు. ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి క్యామ మల్లేశ్ను గెలిపించాలి.
– బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే