అర్వపల్లి, మే 8 : ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం తిమ్మాపురంలో బుధవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పటాకులు కాల్చి బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాలు నాలుగు నెలల్లో బయటపడ్డాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముసుగులో మరోమారు మోసం చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాప్ పూర్తిగా పడి పోయిందని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ హవా మొదలైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక సీట్లు రావడం ఖాయమన్నారు. కేవలం ఐదు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత ఏ పార్టీకి ఎదురు కాలేదని, కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో చతికిలా పడ్డదని చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అంటే నమ్మి ఓటేస్తే రైతుబంధు ఇవ్వలేదని, ఎకరానికి 15వేల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, నిరుద్యోగులకు 4వేల భృతి ఇస్తామని చెప్పి ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తుంగతుర్తి నియోజకవర్గం రక్త పాతాలతో రగిలిపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాలతో 10 సంవత్సరాలో నియోజకవర్గం పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలమైందని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా కూడా రైతులకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు జిల్లా మంత్రులు అన్ని ఎద్దేవా చేశారు. 4వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ముసలోళ్లను కూడా మోసం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క నిమిషం కూడా పోని కరెంట్ ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలువదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని, క్యామ మల్లేశ్ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంటెద్దు నరసింహారెడ్డి, జడ్పీటీసీలు దావుల వీరప్రసాద్యాదవ్, జీడి భిక్షం, రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గుండగాని సోమేశ్గౌడ్, వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాని, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, గ్రామశాఖ అధ్యక్షులు దశరథ రామారావు, సుందర్, రామలింగయ్య, లింగమూర్తి, మల్లయ్య పాల్గొన్నారు.