కోదాడ టౌన్, మార్చి 8: ప్రభుత్వ పాలన పారదర్శకంగా అందేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని సమాచార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అవినీతికి అస్కారం లేకుండా పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పనులు జరిగినా, వెంటనే ఆర్టీఏ కార్యకర్తలు అవినీతిని బయటకు తీసుకురావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలను ప్రస్తుత సమాజంలో ఉన్న మేధావులు, యువకులు ప్రశ్నించాలన్నారు.
అధికారులు లంచం అనే మాట ఎత్తితే వెంటనే ప్రజలు ఆర్టీఏ కార్యకర్తలకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూరి శివ, జిల్లా ఉపాధ్యక్షుడు విక్టర్ బాబు, నియోజకవర్గ అధ్యక్షుడు ఏసు పాదం, జిల్లా సహాయ కార్యదర్శి కిన్నెర ఉపేందర్, కోదాడ పట్టణ అధ్యక్షుడు గంధం పాండు, కార్యదర్శి మాతంగి శ్రీను, నకిరేకంటి నాగేంద్రబాబు, రశీద్, పాతకోటి రామారావు పాల్గొన్నారు.