రామగిరి, జూన్ 19 ; సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యతోనే సకలం సిద్ధిస్తాయని భావించి సర్కారు పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టడంతోపాటు డిజిటల్ విద్యను తీసుకొచ్చారు. మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా సకల వసతులు కల్పిస్తున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నాడు వెలవెలబోయిన స్కూళ్లు నేడు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో గురుకులాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వచ్చింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాలకు మెడికల్ కళాశాలలు రాగా.. జిల్లాలో నర్సింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. స్వరాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధులు రావడంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అన్ని వసతులు సమకూర్చుకున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. నల్లగొండలో జరిగే వేడుకలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరు కానున్నారు. విద్యా వ్యవస్థలో సరళీకరణ, సమాచార సేకరణకు పాఠశాలలకు ట్యాబ్స్ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు అందించనున్నారు.
రామగిరి, జూన్ 19 : అన్ని వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యనందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే ఆయా పాఠశాలల్లో కార్పొరేట్, ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆధునిక టెక్నాలజితో డిజిటల్ తరగతులు సైతం అందుబాటులోకి తెచ్చింది. అంతేకుండా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞాతలు తెలుపుతున్నారు.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా..
అన్ని వర్గాలకు వారికి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు వాటిలో అమలు చేస్తున్న విద్య విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి కోసం వారికి విద్యతోపాటు కరిక్యూలం, కో కరిక్యూలం యాక్టివిటీస్ అందిస్తున్నారు. అలాగే ప్రత్యేక మెనూతో రుచికరమైన ఆహారం అందిస్తూ కార్పొరేట్కు ధీటుగా మౌలిక వసతులు కల్పించారు. దాంతో గురుకులాల్లో చేరడానికి విద్యార్థులు క్యూ కడుతున్నారు. మరో వైపు ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని అంశాలల్లో సత్తాచాటుతూ ఎవరెస్టు శిఖరంపై కీర్తిపతాకం ఎగురవేశారు.
సర్వాంగ సుందరంగా ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి ‘మన ఊరు-మనబడి’, మన బస్తీ -మనబడి’ పథకాన్ని చేపట్టింది. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడంతో సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు మిషన్ భగీరథ తాగునీరు, ముత్రశాలలు, మరుగుదొడ్డు బాల,బాలికలు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. హైస్కూల్స్లో విద్యార్థులకు డైనింగ్(భోజనశాలలు) ఏర్పాటు చేశారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకంతో 15న పాఠశాలలను పున: ప్రారంభించనున్నారు. అలాగే 152 పాఠశాలల్లో ఆధునిక గ్రంథాలయాలను ప్రారంభించనున్నారు.
అందుబాటులోకి డిజిటల్ విద్య
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, బాలికలకు శానిటేషన్ కిట్స్ను సర్కార్ అందిస్తున్నది. అయితే ఈ ఏడాది 2023-24 నుంచి ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు వర్క్బుక్స్, హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ను అందజేస్తున్నది. పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యను అందుబాటులోకి తేవడంతోపాటు అందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చడంతో నేటి నుంచి వీక్షించనున్నారు. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయుల, ఇతర సమాచారాన్ని ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని ప్రభుత్వం ట్యాబ్స్ అందిస్తున్నది. నేడు విద్యా దినోత్సవంలో ఎంపిక చేసిన పాఠశాలకు అధికారులు ట్యాబ్స్ అందించనున్నారు.
నేడు పాఠశాలల్లో విద్యా దినోత్సవం
జిల్లా వ్యాప్తంగా 1,333 పాఠశాలల్లో మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలను పచ్చని తోరణాలతో అలంకరించాలి. విద్యా దినోత్సవం విశిష్టత వివరించేలా ర్యాలీలు నిర్వహించి, బడి బయటి పిల్లలను వంద శాతం బడిలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, ఇతర అంశాలను తెలిపేలా సమావేశాలు నిర్వహించి వివరించనున్నారు. అలాగే విద్య ఆవశ్యకతపై విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, రంగోలీ ఇతర పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్వహించనున్న సైన్స్ హ్యాకథాన్ నిర్వహించనున్నారు.
లక్ష్మీ గార్డెన్స్లో ..
నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో విద్యా దినోత్సవం నిర్వహించే విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. కార్యక్రమానికి మంత్రి జగదీశ్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కలెక్టర్, ఎస్పీ, డీఈఓ, ప్రజాప్రతి నిధులు హాజరుకానున్నారు.
సర్కార్ బడిలో చేరేందుకు ఆసక్తి
ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దింది. ఆంగ్ల మాధ్యం, వసతుల కల్పనతో సర్కార్ బడిలో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.
–అండెం శ్రీనివాస్గౌడ్, గెజిటెడ్ హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ మర్రిగూడ-నల్లగొండ (మం)
ప్రైవేటుకు దీటుగా విద్యనందిస్తున్నాం
ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనలతో సమూలమైన మార్పులు వచ్చాయి. ఉపాధ్యాయులకు సైతం విద్య నైపుణ్య అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వృత్తి నైపుణ్యాలు కల్పిస్తున్నది. మేం కూడా ప్రైవేటుకు ధీటు విద్యను అందిస్తున్నాం.
– తరాల పరమేశ్యాదవ్, ఉపాధ్యాయులు, ఎంపీపీఎస్- కత్తాల్గూడ- నల్లగొండ.