ఉమ్మడి నల్లగొండలో జిల్లాకో మెడికల్ కాలేజీ
ఒకప్పుడు వైద్య విద్య అంటే కొందరికే సాధ్యమయ్యేది. ఉన్న అతి కొద్ది సీట్లల్లో అవకాశం దొరకాలి అంటే ప్రతిభైనా ఉండాలి లేదా బాగా డబ్బైనా ఉండాలి. అందుకే చాలా మంది వైద్య వృత్తిలోకి వెళ్లాలని ఉన్నా అసాధ్యమయ్యేది. మధ్య తరగతి విద్యార్థులకు సమైక్య రాష్ట్రంలో వైద్యవిద్య అందని ద్రాక్షగానే మిగిలింది. డబ్బున్నా ఇక్కడ సీట్లు లేని ధనిక, ఓ మాదిరి కుటుంబాల పిల్లల్లో కొందరు వైద్యవిద్య కలను నెరవేర్చుకునేందుకు విదేశాల బాట పట్టేవారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అనేక మంది రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి దేశాలకు మెడిసిన్ చదివేందుకు వెళ్లేవారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సర్కారు వైద్యంతోపాటు ప్రభుత్వ వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాంతో పేద, ధనిక తేడా లేకుండా వైద్యవిద్య చేరువైంది.
ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు నడుస్తుండగా వచ్చే ఏడాది నుంచి యాదాద్రిభువనగిరి జిల్లాలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒకప్పుడు రాష్ట్రం మొత్తంలో 800 మెడికల్ సీట్లు ఉంటే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనే 400 ప్రభుత్వ మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మెడికల్ సీట్లు పొందిన జిల్లాకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య విద్యలో ఉమ్మడి జిల్లా ప్రముఖ స్థానంలో నిలిచింది. గతంలో ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కూడా లేని పరిస్థితుల్లో కొత్త జిల్లాల వారీగా జిల్లాకో మెడికల్ కాలేజీ కల నెరవేరుతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు విజయవంతంగా కొనసాగుతుండగా.. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.183 కోట్లు మంజూరు చేసింది.
సీఎం కేసీఆర్ 2017లోనే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి సారించగా.. తొలి దఫాలోనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు మంజూరు చేశారు. నల్లగొండ జిల్లా కోసమే డిమాండ్ ఉండగా సూర్యాపేటకు కూడా మెడికల్ కాలేజీ సాధించడంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2017 అక్టోబర్ 12న సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో జరిగిన ప్రగతి సభలో సీఎం కేసీఆర్ ఒకేసారి రెండు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకకాలంలో ఒక ఉమ్మడి జిల్లాకు రెండు ప్రభుత్వ కాలేజీలు మంజూరైన ఏకైక జిల్లా అప్పట్లో నల్లగొండనే.
ఒక్కో కాలేజీలో 150 సీట్ల చొప్పున మొత్తం 300 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో రెండు చోట్లా తొలి బ్యాచ్లో 150 సీట్లతో ఎంబీబీఎస్ తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుతం రెండు చోట్లా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదితో తొలి బ్యాచ్లోని 300 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసుకోనున్నారు. ఇందులో ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. నీట్లో ర్యాంకును బట్టి వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే వైద్య విద్యను పూర్తి చేస్తున్నారు.
వీరిలోనూ ఎక్కువ మంది ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులే ఉండడం విశేషం. తమ వైద్య విద్య కల నెరవేరడానికి సీఎం కేసీఆర్ కారణమని చెబుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయిందని ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి తాత్కాలిక భవనం, ఇతర ఏర్పాట్లతో ఇక్కడ వంద సీట్లతో తరగతులు ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీలతోపాటు అనుబంధ ఆస్పత్రులకు కూడా మహర్దశ పట్టింది.
ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగేండ్ల కిందటి నుంచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు అత్యంత ఖరీదైన వైద్యం ఉచితంగానే ఆయా జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో అందుతుండడం విశేషం. నిపుణులైన వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలు, అన్ని రకాల స్కానింగ్స్, మందులు ఇలా ఎన్నో సౌకర్యాలు ప్రజలకు చేరువయ్యాయి. వచ్చే ఏడాది నుంచి యాదాద్రి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. దీంతో ఇక్కడా కీలకమైన ఎన్నో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
అక్కాచెల్లెళ్లకు ఎంబీబీఎస్ సీట్లు
మిర్యాలగూడ, సెస్టెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల నిరుపేదలకు అందని ద్రాక్షలా ఉన్న ఎంబీబీఎస్ సీటు పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లోనే దొరుకుతున్నది. దీంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీటుకు రూ.కోటి నుంచి 2కోట్ల రూపాయల వరకు అవుతున్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నిరుపేదల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలనే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువైంది.
జాతీయ స్థాయి నీట్ పరీక్షలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన అక్కాచెళ్లెల్లు ప్రతిభ కనబరిచి 2022లో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న నగరా జామ్లానాయక్ – మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అంజలి, రిషిత ఉన్నారు. జామ్లానాయక్ దామరచర్ల మండలం కొండ్రపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు శ్రీచైతన్య కళాశాలలో చదివారు.
పెద్ద కూతురు అంజలి లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షలో 386 మార్కులతో 1,94,948వ ర్యాంకు సాధించింది. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. చిన్న కూతురు రిషిక నీట్ పరీక్షలో 454 మార్కులతో 1,23,174వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని వైద్య కళాశాలలో సీటు పొందింది. ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వ కోటాలో సీట్లు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కళాశాలల ఏర్పాటుతో ప్రభుత్వ సీట్లు దక్కాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. దాంతో డబ్బులు పెట్టి చదువుకోలేని మా లాంటి మధ్య తరగతి, పేదలకు వైద్య విద్య చేరువైంది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అయినా ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు నా వేతనం సరిపోతుంది. ఈ దశలో ఇద్దరు కూతుళ్లు కష్టపడి చదివి నీట్ ర్యాంకులు తెచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ కళాశాలల సంఖ్య పెంచడంతోనే ఎంబీబీఎస్ సీట్లు పెరిగి మా పిల్లలకు ప్రభుత్వ కోటాలో సీట్లు వచ్చాయి. అసాధ్యం అనుకున్న వైద్య విద్య సీఎం కేసీఆర్ ముందు చూపు వల్లే మాలాంటి పేదలకు సుసాధ్యం అయ్యింది. ఇలాంటి నాయకులు పది కాలాలు పాలిస్తే పేదలు, మధ్య తరగతి వారికి మరింత న్యాయం జరుగుతుంది.
– నగరా జామ్లానాయక్, విద్యార్థినుల తండ్రి, మిర్యాలగూడ
ప్రభుత్వ సహకారంతో నెరవేరిన ఆశయం
పొనుగోడు గ్రామానికి చెందిన నందిపాటి మట్టయ్య, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది నిరుపేద కుటుంబం. మట్టయ్య మిర్యాలగూడ ఎఫ్సీఐలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తల్లి మంగమ్మ గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారు కష్టపడుతూ పిల్లలను మంచిగా చదివిస్తున్నారు. అయితే.. వీరి కుమారుడు భానుప్రకాశ్ మునగాల మండలంలోని నారాయణగూడేనికి చెందిన తమ సమీప బంధువు ప్రభుత్వ వైద్యాధికారి రామయ్యను చూసి డాక్టర్ కావాలనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో కష్టపడి చదివాడు.
ఇంటర్మీడియట్ బైపీసీలో 883 మార్కులు సాధించిన భానుప్రకాశ్.. ఎలాగైనా తన కలను నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు. కానీ.. పేదరికంంతో నిరాశకు గురయ్యాడు. అయినా.. ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వ ఉచిత కోచింగ్ సెంటర్లో సీటు సాధించి సంవత్సరంపాటు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష రాశాడు. కానీ.. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత మొక్కవోని దీక్షతో ఇంటి వద్దే కూర్చుని సొంతంగా చదువుకున్నాడు. రెండో ప్రయత్నంలో నీట్లో రాష్ట్ర స్థాయిలో 6600వ ర్యాంక్, ఎస్సీ కేటగిరిలో 597వ ర్యాంక్ సాధించి లక్ష్యాన్ని సాధించగలిగాడు.
ప్రభుత్వ అండతోనే ఎంబీబీఎస్ సీటు
నా లక్ష్యానికి పేదరికం అడ్డుగా మారినా.. ప్రభుత్వం అండగా నిలువడంతోనే నా ఆశయం, నా తండ్రి చిరకాల కోరిక నెరవేరింది. ప్రస్తుతం దేనికైనా పోటీ బాగా పెరిగింది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం సంతోషకరం. కాలేజీల ఏర్పాటు వల్ల సీట్లు బాగా పెరిగిన కారణంగానే నాకు జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి బ్యాచ్లోనే సీటు లభించింది. పేదలకు ప్రభుత్వం కల్పించిన అవకాశాలతోనే నేను డాక్టర్ సీటు సాధించగలిగా. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. దానికి ప్రతిఫలంగా ప్రభుత్వ డాక్టర్నై పేదలకు వైద్య సేవలు అందిస్తా.
– నందిపాటి భానుప్రకాశ్
గరిడేపల్లి, సెప్టెంబర్ 19 : తన సమీప బంధువు డాక్టర్ వృత్తిలో చేరి ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్న తీరును చూసి తాను ఎలాగైనా డాక్టర్ అయి తీరాలనుకున్నాడు. అదే లక్ష్యంతో కష్టపడి చదివాడు. ఈ పరిస్థితిలో తన లక్ష్యానికి పేదరికం అడ్డుగా మారింది. అయినా.. ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో ఇతర మార్గాలను అన్వేషించాడు. ప్రభుత్వం అందిస్తున్న కోచింగ్ సెంటర్లో సీటు సాధించి సంవత్సరంపాటు ఉచిత కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ మొక్కవోని దీక్షతో చదివి రెండోసారి ఎంబీబీఎస్ సీటు సాధించాడు గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన నందిపాటి భానుప్రకాశ్.
తండాల తలుపు తట్టిన వైద్య విద్య
దామరచర్ల, సెప్టెంబర్ 19 : విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఉన్నత విద్య మారుమూల తండాల్లోని తలుపులు తట్టుతున్నది. రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ఒకప్పుడు ఆర్థికంగా ఉన్నవారికే పరిమితమైన మెడిసిన్ చదువు నేడు పేద, బడుగు, బలహీన వర్గాలకు చేరువైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపితమైంది. మండలాల్లో గురుకులాలతోపాటు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో నిరుపేద విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో దామరచర్ల మండలంలోని ముగ్గురు గిరిజన విద్యార్థులు నీట్లో ర్యాంకులు సాధించి మెడిసిన్లో సీట్లు పొందారు.
మా అమ్మ కోరిక నెరవేర్చాను
మాది నిరుపేద గిరిజన కుటుంబం. మా నాన్న వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తాడు. నేను ఒకటి నుంచి పదో తరగతి వరకు అడవిదేవులపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. రోజూ ఆరు కిలోమీటర్లు సైకిల్పై వెళ్లేవాన్ని. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. రెండు సార్లు నీట్ పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దాంతో నిరుత్సాహం వచ్చింది. పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని మా అమ్మ నాకు నచ్చజెప్పింది. ఆమె కోరిక మేరకు ఇంట్లోనే ఉండి చదివి పరీక్ష రాశాను. ఈ సారి లక్షా12వేల ర్యాంకు వచ్చింది. అపోలో కాలేజీలో సీటు వచ్చింది. సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టడం వల్లే సీట్ల సంఖ్య పెరిగి నా లాంటి వారికి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి.
– నేనావత్ మునినాయక్, వీర్లపాలెం, దామరచర్ల
నిరుపేదలకు చేరువైన ఉన్నత విద్య
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికల వల్లే నిరుపేద కుటుంబాలకు ఉన్నత విద్య చేరువైంది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో మారుమూల గిరిజన తండాల విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చినయి. మా అమ్మాయి లావూరి ఖుషి ఇటీవల నీట్లో 60వేల ర్యాంకు సాధించింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. మా మండలంలో ముగ్గురు విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం సంతోషకరం.
– లావూరి శ్రీనునాయక్, వాచ్యాతండా, దామరచర్ల మండలం
స్వరాష్ట్రంలో పేదలకు అందుతున్న పెద్ద చదువులు
తెలంగాణ వచ్చినంక పెద్ద పెద్ద చదువులు పేద కుటుంబాల విద్యార్థులకు చెందుతున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన నేను గతంలో పాలిష్ మిల్లులో కూలి పని, వ్యవసాయం చేసేది. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక అబ్బాయి. ముగ్గురూ డాక్టర్ చదువు చదువుతున్నారు. పెద్దమ్మాయి హైమావతి నాలుగేండ్ల క్రితం నీట్లో ర్యాంకు సాధించి హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసింది. రెండో అమ్మాయి పద్మ రెండేండ్ల క్రితం నీట్లో ర్యాంకు సాధించి విజయవాడ సిద్దార్థ కాలేజీలో మెడిసిన్ రెండో సంసత్సరం చదువుతున్నది. నా కొడుకు రామకృష్ణ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 67వేల ర్యాంకు సాధించి ఉస్మానియాలో సీటు సాధించాడు.
– నేనావత్ బుజ్జిబాబు, వీర్లపాలెం, దామరచర్ల మండలం
డాక్టరయ్యే అవకాశం కలిగింది
మా అమ్మ సావిత్రి, నాన్న కాంతారావు వ్యవసాయ కూలి పనులు చేస్తూ నన్ను చదివించారు. పదో తరగతి వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాను. గత ఏడాది నీట్ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 4,918వ ర్యాంక్ సాధించాను. జగిత్యాలలో సీటు లభించింది. ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేసి ఈ ప్రాంతంలో నిరుపేదలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మా లాంటి పేదలకు డాక్టర్ అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– తెలగవోళ్ల నిషాంత్, గోవిందాపురం, హుజూర్నగర్ మండలం
ప్రభుత్వ కాలేజీలు పెంచడంతోనే ఎంబీబీఎస్లో సీటు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లు వస్తున్నాయి. మా నాన్న లక్ష్మీనారాయణ కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నాడు. నేను నీట్లో 25,630వ ర్యాంక్ సాధించాను. ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేజీలను పెంచడంతో నాకు వరంగల్ కాలేజీలో సీటు వచ్చింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచకపోతే సీటు రాకపోయేది. డబ్బులు పెట్టి ఎంబీబీఎస్ చదివే స్థోమత మాకు లేదు. ప్రభుత్వ కాలేజీలో సీటు రాకుంటే చదువు ఆపివేయాల్సి వచ్చేది. పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– పల్లి శ్రీసుగుణ ప్రణతి, హిల్కాలనీ, నందికొండ
పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తా
గత ప్రభుత్వాలు పేద విద్యార్థుల చదువును గాలికొదిలేశాయి. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేశారు. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కొలువులు సాధించి వృద్ధిలోకి వస్తున్నారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు డాక్టర్ విద్య చదువడానికి సులువైంది. గతంలో కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ విద్యను అభ్యసించేవారు. దీంతో ఉన్నత వర్గాలకే ఎంబీబీఎస్ సీటు దక్కేది. పేదలకు అందని ద్రాక్షలా మిగిలేది.
ఇప్పుడు తక్కువ ర్యాంకు వచ్చిన పేద విద్యార్థులకు సైతం ఎంబీబీఎస్ సీటు వస్తున్నది. మారుమూల తండాకు చెందిన నాకు ఎంబీబీఎస్ సీటు రావడం సంతోషంగా ఉన్నది. మా తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ నన్ను చదివించారు. సీఎం కేసీఆర్ అనుసరించిన విద్యా విధానం వల్లే నాకు మెడికల్ సీటు వచ్చింది. మా తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా డాక్టర్ అయి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తా.
– సపావత్ వినోద్, గరికనట్తండా, తిరుమలగిరి (సాగర్) మండలం