నీలగిరి, మార్చి 1 : నల్లగొండ పాత జడ్పీ కార్యాలయంలో ఉన్న జిల్లా ఆడిట్ అధికారి కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో పైళ్లు, కంప్యూటర్లు, కుర్చీలు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. అధికారుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటికి గాని మంటలు అదుపులోకి రాలేదు. విషయం తెలువడంతో ఆడిట్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకురాలు రేవతి దేదీప్య వెంటనే కార్యాలయానికి చేరుకొని కాలిపోయిన ఫైళ్లను పరిశీలించారు. ఘటనను గురించి జిల్లా ఆడిట్ అధికారి కృపాకర్రావును అడిగి తెలుసుకున్నారు. షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
ఎకువ రికార్డులన్నీ రెండో నంబర్ హాల్లో ఉంటాయని, కొన్ని రికార్డులు మాత్రమే ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన హాల్లో ఉన్నాయని, అందులో కొన్ని కాలిపోయాయని చెప్పారు. సుమారు రూ.6 లక్షల విలువైన సామగ్రి కాలిపోయిందని పేర్కొన్నారు. నాలుగోతరగతి ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ పుస్తకాలు కొన్ని కాలిపోయాయని సిబ్బంది వద్ద ఉన్న సమాచారంతో రికార్డులను తిరిగి రూపొందిస్తామని తెలిపారు. ప్రమాదంపై ఉన్నతాధికారులకు సమాచారం అం దించామని, పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
అగ్ని ప్రమాద ఘటనపై కొందరు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్యూట్ జరిగిందా లేక ఏవైనా అక్రమాలకు పాల్పడిన వారు ఉద్దేశపూర్వకంగా చేశారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.