భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి12 : మండలంలోని దోతిగూడెంలో గల ఎస్వీఆర్ లేబోరేటరీస్లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై మంటలార్పడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలోని ప్రొడక్షన్ ఏ బ్లాక్లో సాల్వెంట్ను లోడ్ చేస్తుండగా రియాక్టర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే పని చేస్తున్న కార్మికులు బయపడి బయటకు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం పక్కనే ఉన్న హెజెలో కంపెనీ నుంచి ఫైర్ ఇంజిన్ను తెప్పించి సిబ్బంది, కార్మికులు కలిసి మంటలను ఆర్పారు. దాంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. అయితే రియాక్టర్లో మంటలు ఎలా వచ్చాయనేది విచారణలో తేలనుందని అన్నారు. ఇదే కంపెనీలో గతంలోనూ అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇకనైనా సరైనా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.