నేరేడుచర్ల, డిసెంబర్ 4: బైక్ను లారీ ఢీ కొనడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ సంఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. ఎస్ఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ(40) కుమారుడు జశ్వంత్ (12), కూతురు కావేరి(14)తో కలిసి మండలంలోని చిల్లేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న అన్న వెంకట్రాములు ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్కు వెళ్తున్న మట్టి లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో సత్యనారాయణ, జశ్వంత్లు అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తె కావేరికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను హుజూర్నగర్ ఏరియా దవాఖానకు తరలించారు. సత్యనారాయణ భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జశ్వంత్ 7వ తరగతి, కావేరి 9వ తరగతి చదువుతున్నది.
కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో రామాపురంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పులువురిని కంటతడి పెట్టించింది. కావేరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కాగా మృతుల కుటుంబ సభ్యులను దవాఖానలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. కావేరికి మెరుగైన వైద్యం అందించాలని గాంధీ దవాఖాన వైద్యాధికారులకు సూచించారు.