నీలగిరి, ఫిబ్రవరి 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిని పొందేందుకు జిల్లాలో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారని, ఇప్పటివరకు 2 లక్షల 41 వేల 39 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తకిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకు రైతులకు అవగాహన కల్పించాలని, మీ-సేవ లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర లాగిన్ చేసుకోవాలని చెప్పారు. దీని వల్ల కేంద్ర పథకాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల కింద రైతులు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగం మొత్తం డిజిటలైజేషన్ చేయనున్న దృష్ట్యా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి.. అందరూ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ అధికారి శ్రవణ్, మండల అధికారులు పాల్గొన్నారు.