రామగిరి, నవంబర్ 28 : ప్రధాని మోదీ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వర్గాలు, కార్పొరేట్లు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలు అవలంబిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ విమర్శించారు. నల్లగొండలోని ఏచూరి గార్డెన్స్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ సోమవారం రెండోరోజూ కొనసాగింది. తొలుత ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సంఘం జెండా ఆవిష్కరించారు.
రైతు సంఘం నాయకులు అమరవీరుల స్తూపానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ పోరాట చరిత్రలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానముందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జాతీయ, అంతర్జాతీయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. దీని ఫలితంగా 3వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలేర్పడి జమీందారుల నుంచి 10లక్షల ఎకరాల మిగులు భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు.
మోదీ ప్రభుత్వం అచ్చేదిన్ నినాదంతో ప్రజలను మోసగిస్తున్నదన్నారు. మోదీ పాలనలో దేశంలో లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంబానీ, అదాని వంటి బడా కార్పొరేట్ వ్యక్తులకు రూ.లక్ష కోట్ల రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు ఎందుకు ముందకు రావట్లేదని ప్రశ్నించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు ఉత్పత్తి వ్యయంపై 50శాతం అదనంగా కలిపి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ దేశంలో దోపిడీ వ్యవస్థ పోవాలన్నారు.
ఆర్ఎస్ఎస్ భావజాలన్ని అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్య పద్మ మోదీ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం కేంద్రంపై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కౌలు రైతులను రైతుగా గుర్తించాలని మహాసభలో తీర్మానం చేశారు. అంతకుముందు రైతు సంఘం మహాసభలకు హాజరైన ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నమ్ మొల్ల, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జుకృషన్ ఘనంగా స్వాగతం పలికి పూలమాలతో సన్మానించారు. మహాసభలో ప్రజానాట్య మండలి కళాకారుల ఆటపాట అలరించాయి.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకట్రెడ్డి, వల్లపు వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంతల చంద్రారెడ్డి, నాయకులు బండా శ్రీశైలం, మొండు శోభన్, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, సీహెచ్.లక్ష్మీనారాయణ, కందాల ప్రమీళ, నాంపల్లి చంద్రమౌళి, కుమ్మరి శంకర్ పాల్గొన్నారు.