గరిడేపల్లి, అక్టోబర్ 3 : నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు రాకపోవడంతో ఇతర నీటి వనరులు ఉన్న రైతులు ఈ వానకాలం సీజన్లో తక్కువ విస్తీర్ణంలో వరి, ఇతర పంటలను సాగు చేశారు. అయితే.. అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో రైతులు మోతాదుకు మించి రసాయన మందులను వాడుతున్నారు. ఈ క్రమంలో క్రిమిసంహారక మందులను సరైన పద్ధతుల్లో పిచికారీ చేయకపోవడంతో వారి ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది.
దీంతోపాటు పంటల్లో మందుల అవశేషాలు మిగిలి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. పంటలపై వినియోగించే సస్యరక్షణ మందుల కొనుగోలు సరైన మోతాదులో మందు కలపడం, పిచికారీ వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ సూచిస్తున్నారు. పంటలకు ముందుగా ఏ తెగులు, ఏ పురుగు సోకిందో గుర్తించాలి. ఆయా తెగుళ్లు, పురుగుల నివారణకు సరైన మందులను సిఫారసు మేరకు తెచ్చుకోవాలి. ఏ సమయంలో పిచికారీ చేయాలో, ఏ రకమైన మందులను కలిపి వాడుకోవచ్చో స్పష్టంగా తెలుసుకోవాలి.
గుర్తింపు పొందిన కంపెనీల లేబుల్, సీల్ సరిచూసుకోవాలి. సీసాలకు మూతలు బిగించిన తర్వాత వేసిన సీల్ను పరిశీలించాలి. లైసెన్సు పొందిన దుకాణాల్లోనే మందులను కొనుగోలు చేయాలి. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దు. మందులను ఇంటి వద్ద నిల్వ చేయడం క్షేమం కాదు. పురుగు మందులను ఎక్కువ కాలం నిల్వ చేస్తే వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. కొనుగోలు చేసేటప్పుడు వాటి తయారీ తేదీని చూసుకోవాలి.
తెగుళ్లు, పురుగు మందుల పనితీరు వేర్వేరుగా ఉంటుంది. వాటిని కలిపి వాడేటప్పుడు ఏ మందులో ఏది కలిస్తే సమర్థవంతంగా పని చేస్తుందో సూచించిన ప్రకారం వాడుకోవాలి. విచక్షణా రహితంగా అన్ని రకాల మందులను కలిపి పిచికారీ చేయకూడదు.
పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోగాన్ని బట్టి మందులు వాడాలి
పంటలకు వచ్చిన రోగ లక్షణాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత రోగాన్ని నిర్ధారించుకొని దానికి అవసరమైన మందులను మాత్రమే కొనుగోలు చేసి తగిన మోతాదులోనే పిచికారీ చేయాలి. గాలికి ఎదురుగా మందులను పిచికారీ చేయకూడదు. మబ్బులు పట్టినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం సరికాదు. తగు జాగ్రత్తలు పాటిస్తూ మందులను పిచికారీ చేస్తే పంట చేలపై రోగాలు నివారింపబడడమే కాకుండా పిచికారీ చేసే వారికి ఏ ఇబ్బందులూ ఉండవు. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి