రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.. అలా చేస్తే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు.
వానకాలం పంటగా వేసిన దీర్ఘకాలిక కంది రకాలు ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్నాయి. వీటికి శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి పంటను నాశనం చేస్తాయి. శనగపచ్చ పురుగు నివారణకు తొలిదశలో క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, క్వినాల్ఫాస్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ను 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందును వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగు ప్రభావం తగ్గకుంటే ఇండాక్సికార్బ్ 1 మి.లీ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లేదా 0.3 మి.లీ క్లోరంత్రనిప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఈ పురుగు ఆకులను, పూతను ఒక దగ్గరకు చేర్చి గూడుగా మార్చి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీలు, 1 మి.లీ డైక్లోరోవాస్ లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పురుగు తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే థయోడికార్బ్ 1 గ్రాము లేదా స్పైనోసాడ్, ఫ్లూ బెండమైడ్ 0.3 మి.లీల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు వేసిన వేరుశనగ పైరు ప్రస్తుతం పూతదశలో ఉన్నందున చివరిసారిగా అంతరకృషి చేసి హెక్టారుకు 500 కిలోల జిప్సంను 5 సెం.మీల లోతులో మొక్క దగ్గర వేసి మట్టితో ఎగదోయాలి. అనంతరం నీరుపెట్టాలి.
కుసుమ పంటకు విత్తిన 40 నుంచి 45 రోజుల వరకు పేను తాకిడి చాలా ప్రమాదకరమైంది. దీని నివారణకు డై మిథోయేట్ 2 మి.లీలు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మి.లీలు లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీలు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు పంట వేసిన 20 రోజుల నుంచి పూత దశ వరకు ఆశిస్తుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
యాసంగి పంటగా నవంబర్ 15 లోపు విత్తిన మొక్కజొన్న పైరు 30 నుంచి 35 రోజులలోపు వయస్సున్నప్పుడు అంతరకృషి చేసి హెక్టారుకు 75 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువులు వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగిన తేమ ఉండేలా చూసుకోవాలి. 30 నుంచి 40 రోజులున్న పైరుకు అధిక నీరు హానీకరం. కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగులు ఎక్కువగా యాసంగి మొక్కజొన్నను ఆశిస్తాయి. పైరు మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల నుంచి ఇవి ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోపాస్ ఎకరాకు 320 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి కార్బోఫ్యురాన్ 3జీ గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుంచి 30 రోజులకు ఆకు సుడులలో వేయాలి.
యాసంగిలో సాగు చేసిన శనగ పంటకు ఈ నెలలో సాధారణంగా పచ్చపురుగు లేదా రబ్బరు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. వీటి నివారణకు తొలిదశలో 2.5 మి.లీల క్లోరోఫైరిఫాస్ లేదా 2 మి.లీల క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే స్పైనోసాడ్ 0.3 మి.లీలు లేదా డై ఫ్యూ బెంజురాన్ 1 మి.లీలు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో ఒకటి లేదా 2 సార్లు పిచికారీ చేయాలి.
ఆరుతడి పంటగా నవంబర్లో వేయడానికి వీలుగానీ పరిస్థితులలో ఈ నెలలో పొద్దు తిరుగుడును విత్తుకోవచ్చు. హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవడం మంచిది. కేబీఎస్హెచ్-44, ఎన్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1, ఏపీఎస్హెచ్-66 రకాలు అనువైనవి. నవంబర్లో విత్తిన పైరుకు 30 నుంచి 35 రోజుల్లో హెక్టారుకు 40 కిలోల నత్రజని ఎరువులు వేయాలి.
రైతులు సాగు చేస్తున్న పంటల్లో సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. పంటలకు ఆశిస్తున్న పురుగులు, తెగుళ్లను గుర్తించి రైతులు అందుకు అనుగుణంగా మందులు ఎంపిక చేసుకొని పిచికారీ చేయాలి. మందుల పిచికారీలో సరియైన విధానాలను అవలంభించాలి. అప్పుడే వాటి ప్రభావం తగ్గి మంచి దిగుబడులు సాధించవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే ఇన్చార్జి పీసీ, గడ్డిపల్లి