నీలగిరి, మార్చి 24 : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన బెల్లి వెంకన్న, లింగయ్య ఇద్దరు అన్నదమ్ముళ్లు. కాలం కలిసి రాకపోవడంతో వెంకన్న బతుకుదెరువు కోసం బొంబాయి పోయాడు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకాలతో వెంకన్న బొంబాయి నుంచి స్వగ్రామానికి వచ్చి ఇక్కడే వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మార్చి 18న వెంకన్న, లింగయ్య ఇద్దరు అన్నదమ్ముళ్ల పశువుల కొట్టం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పశువుల గడ్డిని తగులబెట్టారు. దాంతో లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకన్నపై అనుమానంతో కట్టంగూర్ ఎస్ఐ అతన్ని పిలిచి విపరీతంగా కొట్టి అదేరోజు సాయంత్రం విడుదల చేశారు.
ఇంటికి వెళ్లిన వెంకన్న జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పడంతో తన భర్తకు సంబంధం లేని విషయంలో కేసు పెట్టి కొట్టడంతో ఆవేశంలో ఆక్రోశాన్ని వెల్లగక్కింది. దాన్ని రికార్డు చేసిన లింగయ్య మరుసటి రోజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో మరోసారి వెంకన్నను ఎస్ఐ స్టేషన్కు రమ్మని చెప్పడంతో ముందురోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని చేసేది లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కారణాలు లేకుండా స్టేషన్కు పిలిచి విపరీతంగా కొట్టిన కట్టంగూర్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్నను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకన్న దుస్ధితికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.