భువనగిరి కలెక్టరేట్, మార్చి 27 : రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, ప్రభుత్వ విద్య, వైద్యంపై ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయి విశ్వాసం నెలకొందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, వైద్యం కోసం అత్యధికంగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా పని చేస్తుంటే.. కేంద్రంలోని మోదీ సర్కారు పేదల కడుపులు కొట్టి పెద్దలకు దోచిపెడుతుందని ఆరోపించారు. నిత్యావసర వస్తువులతోపాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారాన్ని మోపుతుందన్నారు. దుర్మార్గంగా ఆలోచిస్తూ మరోసారి విద్యుత్ బిల్లులను పెంచి నిరుపేదలపై గుదిబండ వేస్తుందన్నారు. దేశంలోని 35 శాతం మంది ప్రజలు అర్ధాకలితో ఉంటున్నారని, ఇవేవీ పట్టని కేంద్రం పేదలను మరింత పేదరికంలోకి నెట్టివేసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. ప్రజలంతా ఏకమై మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సూచించారు. అనంతరం గ్రంథాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ బీరు మల్లయ్య, డీసీపీ రాజేశ్చంద్ర, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని హుస్సేనాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన రైతు సేవ కేంద్రం ప్రారంభోత్సవం, వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దండుగ అనుకున్న వ్యవసాయం స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై మక్కువతో ఓ విజన్తో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడితో దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం నుంచి కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులే దిగుబడి రాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే 47 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడితే రైతును రాజు చేయొచ్చన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరిందని, అదే రైతు మరింత సుసంపన్నం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అని పేర్కొన్నారు. సమైక్యాంధ్రలో సాగర్ ఎడమ కాల్వ కింద భూములకు వరుసగా మూడు మార్లు నీళ్లు విడుదల చెయ్యలేని దుస్థితి ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 16వ సారి నీటిని విడుదల చేసుకున్నామని, ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే అని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, మారెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మ న్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరా ల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్ల య్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.