ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలతోపాటు క్రీడా రంగం తీవ్ర వెనుకుబాటుకు గురైందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత క్రీడా నైపుణ్యాన్ని లోకానికి చాటిన ధ్యాన్చంద్ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం ఆయన క్రీడాస్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయడమేనని తెలిపారు. మంగళవారం క్రీడా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో క్రీడలతో మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించి దేశం గర్వించే స్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా మారిన సూర్యాపేటలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ స్కూల్, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 29 : సమైక్య పాలనలో అన్ని రంగాలతోపాటు వెనుకబడిన క్రీడారంగాన్ని స్వరాష్ట్రంలో కేవలం తొమ్మిదేండ్లలోనే అధిక ప్రాధాన్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేశ క్రీడా నైపుణ్యాన్ని చాటిన ధ్యాన్చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆయన క్రీడాస్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయడమే అన్నారు. మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రస్తుతం ఉరుకుల, పరుగుల జీవితంలో అలసిపోతున్న ప్రతి ఒక్కరికీ క్రీడలతోనే మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
క్రీడాపోటీల్లో గెలుపు, ఓటములు సహజమని వాటిని సమానంగా స్వీకరించాలి తప్ప ఓడినవారు నిరుత్సాహ పడకుండా మరో గెలుపునకు ప్రయత్నించాలని సూచించారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంచుకుని సరైన మార్గంలో నడవాలన్నారు. సూర్యాపేటలో ఇప్పటికే జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించుకున్నామని, త్వరలోనే సూర్యాపేటను క్రీడా హబ్గా మార్చుకుని మరిన్ని క్రీడలకు వేదికగా చేసుకుందామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సూర్యాపేటలో స్పోర్ట్స్ స్కూల్, ఇండోర్ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల పలు జిల్లా కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ చేసిన సంచలనాత్మక ప్రకటనతో క్రీడాకారుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. వచ్చే ఏడాది నాటికి స్టేడియాలను పూర్తి చేసుకుని అందులోనే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన క్రీడాకారులు రవీందర్రెడ్డి, మల్లికాంబ, వెంకట్రెడ్డి, మహ్మద్, కోటేశ్వర్రావు, వంశీ, కల్యాణ్, వీరన్న, సమతను సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా క్రీడాధికారి వెంకట్రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, రాంచందర్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.