సూర్యాపేట : తెలంగాణకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ అంశం చెప్పలేదు . కేవలం తెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారే తప్పా రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ భయపడ్డారన్నారు.
మోదీ లక్షల్లో తీసుకుని రాష్ట్రాలకు వందల్లో ఇస్తున్నారు కాబట్టే తడబాటుకు గురయ్యాడన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని మోదీ అన్ని అబద్ధాలు మాట్లాడన్నారు. ప్రధాన మంత్రి హోదాలో స్థాయికి తగట్టుగా వరాలు ప్రకటించని మోదీ తెలంగాణ పేరెత్తినప్పుడల్లా విషం కక్కి ఇప్పుడు ప్రేమ ఓలకబోస్తున్నాడని ఘాటుగా విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుకబాటులో మగ్గుతున్నాయి. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ వస్తే ప్రజలకు మద్దెల దరువే అన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన నూతన అజెండా అంశం చర్చనీయాంశంగా మారుతుందన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా కూడా గుర్తించరన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా బీజేపీ దేశానికి చేసిందేమి లేదని ఆయన మండిపడ్డారు.