రామగిరి, జూలై 25 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటి మాట్లాడారు. విచక్షణా రహితంగా చెట్లను నరికి వేయడం, అడవుల నిర్మూలన, తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇది భావి తరాలకు దుష్పరిణామాలనిస్తాయన్నారు. అందువల్ల భావి పౌరులైన విద్యార్థులు ఖాళీ స్థలాలు ఉన్న ప్రతిచోట మొక్కలు నాటడమే కాకుండా, వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ కాపాడాలన్నారు.
మహిళలు బాగా చదువుకోవాలని, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించాలని, మహిళ దృఢంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించాలని, ఇందుకు చదువు ఒకటే మార్గం అన్నారు. నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించడం జరిగిందని, బయో టెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరుగుతున్నదని తెలిపారు. కనగల్, తిప్పర్తిలో జూనియర్ కళాశాలలను ప్రారంభించినట్లు వెల్లడించారు. జూనియర్ కళాశాల స్థాయిలో మధ్యలో, కళాశాల మానివేసే వారే కాకుండా ఇతరులు కూడా నేరుగా రామగిరి డిగ్రీ కళాశాలలో చేరవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు.
Nalgonda : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి