నల్లగొండ, సెప్టెంబర్ 14: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అధికారి స్పష్టమైన అవగాహనతో ఎన్నికలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధ్దం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జీఎమ్ కన్వెన్షన్ హాల్లో గురువారం ఆర్ఓ, ఏఆర్ఓ, పీఓ, సెక్టార్, పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల ముందు నుంచి కౌంటింగ్ వరకు ప్రతి ప్రక్రియ నిర్వాహకులకు పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలన్నారు. పీఓ నుంచి ఆర్ఓ వరకు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండి ఎప్పడికప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అలసత్వం లేకుండా పని చేయాలని సూచించారు.
జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో 179 మంది సెక్టార్ అధికారులను నియమించి ఒక సెక్టార్ పరిదిలో 10 నుంచి 10 పోలింగ్ స్టేషన్లు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా సెక్టార్ అధికారులు మొదటి నుంచి పోలింగ్ పక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణ, ప్రవర్తన, శాంతి భద్రత, పోలింగ్ విధానం, వీవీప్యాట్, ఈవీఎంల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అక్కడ ఓటర్ల వివరాలు, పోలింగ్ లొకేషన్లు లాంటి అంశాలు తెలుసుకోని జోనల్ మేజిస్ట్రేట్గా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో 1766 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆయా పోలింగ్ కేంద్రాలు సందర్శించకుండా రూట్ మ్యాప్ ఫైనల్ చేయవద్దని సూచించారు. అలాగే ఓటరు షెడ్యూల్పై ప్రచారం నిర్వహించి ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలని అన్నారు. అనుమానిత ఓటర్ల పరిశీలన, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు కూడా స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో గుర్తించాలని అన్నారు. ఎన్నికల రోజు ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే అన్నారు. అనంతరం ఎస్పీ అపూర్వారావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ర్టాలు, జిల్లాల సరిహద్దు చెక్పోస్టుల బాద్యత పకడ్బందీగా చేపడతామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, శ్రీనివాస్తో పాటు ఆర్డీఓలు, తాసీల్దార్లు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.