సూర్యాపేట టౌన్, జనవరి 28 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 14 ఏండ్లు ఉద్యమం చేసిన కేసీఆర్ను చూసి ఎద్దేవా చేసి తిట్టినోళ్లే.. నేడు అభివృద్ధిని చూసి మొక్కుతున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మిర్చి యార్డులో శనివారం 424 మంది లబ్ధిదారులకు రూ.4.24 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2001లో ఆనాటి ఉద్యమ రథసారధిగా కేసీఆర్ చెప్పిన ప్రతి అక్షరం నేడు ఆయన నాయకత్వంలో నిజమైతుందన్నారు.
కోట్లాది రూపాయలతో అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చడంతో పాటు వినూత్న రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నో ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించినప్పటికీ మన తెలంగాణకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగాయన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు వినూత్న పథకాలతో ఆడబిడ్డల ఆత్మగౌరవం మరింత పెంచామని చెప్పారు. సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలను మహిళల పేరున అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకుని నేడు అభివృద్ధి పాలన సాగిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎన్నో చూశామని, పోరాడి సాధించిన తెలంగాణలో వాటిని పూర్తిగా రూపుమాపామని అన్నారు.
ఎనిమిదేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని, దాంతో నేడు ప్రజలు గర్వంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి వృద్ధుల వరకు ఏదోరకంగా అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు పొందుతున్నారన్నారు. ప్రజలు అడుగకుండానే సీఎం కేసీఆర్ అనేక పథకాలు అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, దాంతో నాడు భారమనుకున్న ఆడపిల్లలను నేడు అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన సీఎం కేసీఆర్ అన్ని పథకాలను వారి పేరునే అందిస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలన శ్రీరామ రక్షగా నిలిచిందని, ఈ క్రమంలో అన్ని రాష్ర్టాలు కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు సరిహద్దు గ్రామాలు ఇప్పటికే తెలంగాణలో విలీనం కావాలని కోరుకుంటున్నాయన్నారు. తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలను యావత్ దేశానికి అందించాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని అన్ని రాష్ర్టాలు స్వాగతిస్తున్నాయని, అన్ని రాష్ర్టాల కంటే ఆంధ్రోల్లే ఎక్కువ అభిమానిస్తున్నారని చెప్పారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణతోపాటు యావత్ దేశ అభివృద్ధిలో పెనుమార్పులు తీసుకురావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.300 కోట్లకు పైగా అందజేశామని, సూర్యాపేట నియోజకవర్గంలో సుమారు రూ.7వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, కుమారీ బాబూనాయక్, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు మర్ల చంద్రారెడ్డి, గుర్రం సత్యనారాయణరెడ్డి, వంగాల శ్రీనివాస్రెడ్డి, తూడి నర్సింహారావు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్, జనవరి 28 : ‘అప్పుడెప్పుడో మూసీ, సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయాయని, వారానికోసారి వచ్చే నీళ్లతో తడులు కట్టుకుంటున్నామని తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం ప్రోగ్రామ్కు వచ్చినప్పుడు నాతో చెప్పుకుంట బాధపడినవ్ సైదులు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు, ఉద్యోగాలు మనకే వస్తాయని ఆనాడు చెప్పిన. ఇప్పుడు ఏమనిపిస్తున్నది. పక్కనే మూసీ, సాగర్ జలాలు ఉరకలు పెడుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా.. రైతులందరికీ సంతోషంగా ఉందా.’ అని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రైతులు సైదులును అడిగారు.
శనివారం సూర్యాపేట నుంచి పెన్పహాడ్కు వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలో అనాజీపురం గ్రామంలో రైతులు రహదారిపై మధ్యాహ్న భోజనం చేసి సేద తీరుతుండగా మంత్రి కారు దిగి వారి వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. అక్కడున్న రైతు సైదులు భూమి, సాగు వివరాలు తెలుసుకున్నారు. వానకాలం సాగు చేసిన పత్తి, వరి పంటల తరువాత రెండో పంటగా కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుందన్నారు. పుష్కలంగా నీళ్లు, కరెంటు ఉన్నా యాసంగిలో పడావు ఎందుకు పెడుతున్నారని అడిగారు. మూస పద్ధతి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే మిగతా రైతులు కూడా ముందుకు వస్తారన్నారు. వారి వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట జడ్పీటీసీ జీడి భిక్షం, సర్పంచ్ చెన్ను శ్రీనివాస్రెడ్డి, ఉన్నారు.