Ground water | ఎండిన బోర్లు.. ఒట్టిపోయిన బోరింగ్లు. ఇంకిన బావులు.. నెర్రెలుబారిన చెరువులు, కుంటలు.. ఇవి ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే తుంగతుర్తి నియోజకవర్గంలో కనిపించే దయనీయ దృశ్యాలు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు ఎక్కడ చూసినా జల దృశ్యాలే. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో మండు వేసవిలోనూ జలకళను సంతరించుకున్నాయి. దీంతో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల రాకతో బీడు భూములు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి.
అర్వపల్లి, మే 7
సమైక్య రాష్ట్రంలో కరువు, కక్షలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతంలో 60ఫీట్ల లోతు బావి తీస్తే చాలీచాలని నీళ్లు వచ్చేవి. దీంతో రైతులు బావిలోనే 100 నుంచి 150ఫీట్ల లోతు బోర్లు వేసేది. అయినా.. బోర్లు అరగంట పోసి ఆగిపోయేది. 200 ఫీట్ల వరకు బోరు వేసినా చుక్కనీరు కనిపించని పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావులు పుష్కలంగా పోస్తున్నాయి.
ఒకప్పుడు ఎండిన బోర్లు ఇప్పుడు నిండుగా పోస్తున్నాయి. ప్రస్తుతం బావి తీస్తే 20 ఫీట్లలోనే నీళ్లు వస్తున్నాయి. 40 నుంచి 50 ఫీట్ల లోతులో ఎక్కడ బోరు వేసినా గంగమ్మ ఉబికి వస్తున్నది. 24గంటల విద్యుత్తో రోజంతా మోటర్లు పెట్టినా బోరుబావుల్లో నీళ్లు తగ్గడం లేదు. దీంతో నియోజకవర్గంలోని బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారాయి. నాడు నెర్రెలుబారిన పొలాల్లో నేడు పుట్లకొద్ది పంట పండుతున్నది.