నల్గొండ, ఫిబ్రవరి 7: ధరణి పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కారం పై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు, సలహాలు, సూచనలు అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి సహాయ కేంద్రం(help desk) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో కలెక్టర్ చాంబర్ ఎదురుగా ఈ ధరణి సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధరణి సహాయ కేంద్రం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు.
ధరణి సహాయ కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ లు ఉంటారు. రైతుల సమస్యలు తెలుసుకుని పెండింగ్ భూ సమస్యలపై ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో అవగాహన కల్పిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా ముఖ్యంగా వ్యవసాయ భూముల మ్యుటేషన్, సర్వే నెంబర్ లు, విస్తీర్ణం, నిషేధిత జాబితా తొలగింపు లాంటి సమస్యలు పరిష్కారంకు వెబ్ సైట్ చెక్ చేస్తారన్నారు.
ఏ మాడ్యూల్ లో దరఖాస్తు చేయాలి, ఏ డాక్యుమెంట్ లు జత పరచాలి తదితర విషయాల పై రైతులకు అవగాహన కలిగించి వారి సందేహాలు నివృత్తి చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.