నార్కట్పల్లి డిసెంబర్ 12 : పిల్లలకు పోషకాహారంగా బాలామృతం పనిచేస్తున్నది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసే ఇది చిన్నారులకు వరంగా మారుతున్నది. ఇందులో కాల్షియం, విటమిన్ ఏ, బీ కాంప్లెక్సులతో పాటు అయోడిన్ ఉప్పు కలిపిన గోధుమ పిండి, ఇతర పోషకాలను చేర్చి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్)శాఖతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో 7నెలల నుంచి మూడేండ్ల లోపు చిన్నారులకు నిత్యం పోషకాహారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతినెలా విధిగా బాలామృతం ప్యాకెట్, 16 కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు నెలకు 9.750కిలోల బియ్యం, 750 గ్రాముల కంది పప్పు, నూనె, కోడి గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నో పోషక విలువలున్న బాలామృతంపై ప్రభుత్వం ఐసీడీఎస్తో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది.
టీచర్లు, ఆయాలకు అవగాహన
పిల్లలకు ఎలా తినిపించాలి, దీని వల్ల కలిగే ప్రయోజనాలపై మండలంలో గర్భిణులు, బాలింతలకు సీడీపీఓ, సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం ఉంటే జబ్బులు త్వరగా వస్తాయి. కంటిచూపు మందగించడం, పెదాలు పగలడం, నరాల బలహీనత, ఇతర చర్మవ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వ్యాధులు చిన్నారులకు భవిష్యత్లో రాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా బాలామృతాన్ని పంపిణీ చేస్తున్నది. దీన్ని రోజుకు 100గ్రాముల చొప్పున మూడు నుండి నాలుగు సార్లు చిన్నారులకు తప్పకుండా తినిపించాలని సూచిస్తున్నారు. దీనిపై ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.