పాలకవీడు, జనవరి 28 : మండలంలోని జాన్పహాడ్ దర్గా వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాలు శనివారం సమాధుల వద్ద దీపారాధన కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం లక్షకు పైగా భక్తులతో పోటెత్తిన దర్గా వద్ద మూడో రోజు శనివారం 20వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. సైదులు బాబా సమాధుల వద్ద చాదర్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు పలువురు భక్తులు నాగదేవత పుట్ట వద్ద పాలు, గుడ్లు ఉంచి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గంధం అందని పలువురు భక్తులు ఆలయ ముజావర్ జానీ గృహంలో ఉన్న గంధాన్ని స్వీకరించారు. ఉర్సు ముగియడంతో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులు తిరుగుముఖం పట్టారు. ఉర్సు ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిచిన ఫకీర్లు సైతం తమ ప్రాంతాలకు పయనమయ్యారు. ఉర్సు ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హుజుర్నగర్ ఆర్డీఓ వెంకారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్కన్ యాజమాన్యం, సీజీఎం నాగమల్లేశ్వర్రావు సహకారంతో భక్తులకు తాగు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయడం, వీధుల్లో దుమ్ము లేవకుండా నిరంతరం ట్యాంకర్లతో నీళ్లు చల్లడం, పారిశుధ్య కార్యక్రమాలు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుపై సమీప గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.
ఉర్సుకు లక్షకు పైగా భక్తుల హాజరుతో పాటు వ్యాపార సముదాయాలు, తాత్కాలిక దుకాణాల వ్యర్థాలతో దర్గా పరిసరాలు, వీధులన్నీ నిండిపోయాయి. దీంతో రెవెన్యూ, పంచాయతీ, అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు. ఎంపీడీఓ వెంకటాచారీ, ఎంపీఓ దయాకర్ ఆధ్వర్యంలో 22గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు ఆయా పంచాయతీ సిబ్బందితో పాటు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని యుద్ధ ప్రాతిపదకన తొలగిస్తున్నారు.