– చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి
చండూరు, సెప్టెంబర్ 01 : ప్రభుత్వ చేయూత పెన్షన్ ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పైలేరియా పేషెంట్లు, తలసేమియా, సికిల్సెల్ డిసీజెస్ పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీగా నిర్ణయించగా తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులను అందజేసి రసీదులు పొందాలని సూచించారు. ఆగస్టు 31 వరకు చండూరు మండలంలో 611 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో వితంతువులు 245, ఒంటరి మహిళలు 29, దివ్యాంగులు 130, చేనేత కార్మికులు 05, గీత కార్మికులు 202 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ వెల్లడించారు.