నల్లగొండ సిటీ, జూలై 16 : ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాలో సందడి చేయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ యజమాన్యం నిధుల ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఎలక్ట్రిక్ బస్సు ల కోసం చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలక్ట్రి క్ బస్సుల రాకతో పొల్యూషన్ ఫ్రీ మెయింటెనెన్స్ కావడంతో ఆర్టీసీకి ఇబ్బందులు తగ్గనున్నాయి.
రీజియన్కు 110 బస్సులు..
నల్లగొండ రీజియన్ కేంద్రంగా సూర్యాపేట, నల్లగొండకు 110 బస్సులు రానున్నాయి. వీటి కోసం డిపో అవరణలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 50 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వాటి కోసం అదనపు కెపాసిటీ కలిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రూ.7 కోట్లతో అనుమతులు మంజురయ్యాయి. సెపెంబర్ నాటికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
తగ్గనున్న కాలుష్యం..
కాలుష్యం తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలకు అనుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు రాయితీలు అందజేస్తున్నది. అలాగే చార్జింగ్ పాయింట్లు పెట్టెందుకు అనుమతులు ఇస్తున్నది. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి జత కూడడంతో కాలుష్యం తగ్గే అవకాశం ఉన్నది.
పెరుగనున్న బస్సులు..
అద్దె బస్సులు, ఆర్టీసీ బస్సులు కలిపి నల్లగొండ రీజియన్ పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ డిపోల పరిధిలో 640 బస్సులు ఉండగా ఎలక్ట్రిక్ బస్సుల రాకతో మొత్తం బస్సుల సంఖ్య భారీగా పెరుగనున్నది. ఈ బస్సులను నల్లగొండ, హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట తదితర సుదూర ప్రాంతాలకు నడుపనున్నారు.