నీలగిరి,అక్టోబర్ 31: తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజాసేవ కోసం పాటుపడ్డానని, ఐదేండ్లు నల్లగొండను విడిచిపోయి ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండను కొనాలని ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 8,9,10 వార్డుల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే కరోనా కారణంగా రెండేళ్లు అభివృద్ధి జరగలేదని, రెండేండ్లలోనే రూ.1,400 కోట్ల నిధులు తెచ్చి 40 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అభివృద్ధ్ది ఇలాగే కొనసాగాలంటే ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పించాలన్నారు. నాయకులు లేకున్నా ప్రజలే నా నమ్మకం..నా ధైర్యమని ఎవరెన్ని కుట్రలు చేసినా నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంటే అంత అవసరం లేదని మూడు గంటలు ఇస్తే సరిపోతుందని పీసీసీ చీఫ్ అన్నాడంటే వారికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్ధ్దమవుతుందన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చి మరోసారి మోసం ప్రయత్నం చేస్తుందని దీన్ని ప్రజలు గమనించి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్ మారగోని భవానీగణేశ్, మాజీ కౌన్సిలర్ చిన్నబత్తిని జయప్రకాశ్, దాసరి శౌరిరాజు, నకిరేకంటి సైదులు గౌడ్, వెంకన్న, రవినాయక్, అంజిబాబు, వజ్జ జానయ్య, శ్రీనివాస్ ఉపేందర్యాదవ్ పాల్గొన్నారు.