రామగిరి, ఏప్రిల్ 10 : రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేశారు. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం ఈద్ ఉల్ ఫిత్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేకంగా నమాజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా కొత్త దుస్తులు ధరించి, ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకోనున్నారు. పేదలకు దాన ధర్మాలు చేయనున్నారు. జిల్లా కేంద్రాలతోపాటు పలుచోట్ల ఈద్గాలను ఇప్పటికే సిద్ధం చేయగా పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని ప్రార్థనలు చేయనున్నారు. రంజాన్ నేపథ్యంలో బుధవారం మార్కెట్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది.
కొత్త దుస్తులు, డ్రై ఫ్రూట్స్ తదితర సామగ్రి కొనుగోళ్లలో దుకాణాలు కిటకిటలాడాయి. రంజాన్ మాసం చివరి రోజు కావడంతో హలీమ్, హరీస్ సెంటర్లకు గిరాకీ కనిపించింది. ముస్లింలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటిచెప్పిన రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అల్లా దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.