నీలగిరి, మార్చి 23 : మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని నల్లగొండ ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, మద్యం సేవించి వాహనం నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకునేందుకు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన పలువురి వ్యక్తులకు రోడ్డు భద్రతా నియమాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యల గురించి, రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.