రామగిరి, మార్చి 27 : నాటక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధనలు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా నేటి యువతరాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ సాహితీ వేత్త, పరిశోధకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయమణరెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో ‘తెలుగు నాటకం-సాహిత్య సమాలోచన’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సును బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యంపై ఆసక్తిని పెంపొందింపజేయడమే కాకుండా విద్యార్థులను పరిశోధకులుగా, సాహిత్య అభిమానులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తాయని అన్నారు. ఎంతోమంది నాటక రచయితల రచనలు నేటి సాహితీ లోకానికి అందడం లేదని, వారి సాహిత్యాన్ని వెలికితీసి భావితరాలకు అందజేయాల్సిన అవసరం కవులు, రచయితలు ఇతర సాహితీవేత్తలపై ఉందన్నారు. ప్రముఖ సాహితీవేత్త, జాతీయ ఉత్తమ సినీ విమర్శక అవార్డు గ్రహీత డాక్టర్ పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ తెలుగు నాటక రంగం ఆరంభ వికాసాలను గురించి సమగ్రంగా వివరించారు.
ఆత్మీయ అతిథి కమలాకరశర్మ మాట్లాడుతూ నాటక రంగం మనోరంజకమైందని, కానీ నేడు సినిమాల ప్రభావంతో కనుమరుగైపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఎన్జీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు తండు కృష్ణకౌండిన్య సారథ్యంలో జరిగిన సదస్సులో తెలుగు యూనివర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఆఫ్ డీన్ ప్రొఫెసర్ కరిమిళ్ల లావణ్య, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వివిధ కళాశాలల అధ్యాపకులు లవేందర్రెడ్డి, శ్రీధర్, గోవర్ధనగిరి, సైదులు, ప్రభాకర్, లింగస్వామి, రమ్య, అంజయ్య, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.