యాదాద్రి, ఆగస్టు 16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుదర్శన నారసింహహోమం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. శ్రీస్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయం త్రం వేళలో శ్రీస్వామివారి వెండి మొక్కు జోడు (విహార) సేవ, దర్బార్ సేవ వైభవంగా చేపట్టారు. రాత్రి 7 గంటలకు స్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠమూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
కనులపండువగా కోటికుంకుమార్చన
శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రావణలక్ష్మికోటి కుంకుమార్చన కనులపండువగా సాగుతున్నది. లక్ష్మీ అమ్మవారి సహస్రనామాలను పఠించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయుడిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయుడికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని 22 వేల మంది దర్శించుకున్నారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 25,13,861 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
రూ. 1,22,51,653 యాదాద్రీశుని హుండీల ఆదాయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 14 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,22,51,653 ఆదాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 101 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 400 గ్రాములు వచ్చిందని తెలిపారు. దీంతోపాటు 362 అమెరికా డాలర్లు , 45 యూఏఈ దిరామ్స్, 285 ఆస్ట్రేలియా డాలర్స్, 100 ఒమాన్ బైసా, 30 సింగపూర్ పౌండ్స్, 30 యూరో కరెన్సీలు స్వామివారికి సమకూరినట్లు ఈఓ తెలిపారు.