యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : గర్భిణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు అవసరమైన సదుపాయాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఈ పథకం వర్తిస్తున్నది. 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 20,212 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఇందులో 2017లో 3708 మందికి కిట్లు ఇవ్వగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,667 మందికి పంపిణీ చేశారు. కేసీఆర్ కిట్లో తల్లీబిడ్డలకు అవసరమయ్యే సుమారు రూ. 15 వేల విలువైన వస్తువులు ఉంటాయి. ఇందులో సబ్సులు, బేబీ ఆయిల్, బేబీ బెడ్, దోమతెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవల్, న్యాప్కిన్లు, పౌడర్, డైపర్స్, షాంపు, పిల్లల బొమ్మలు వంటి వస్తువులు ఉన్నాయి. మూడు నెలలకు అవసరమయ్యేలా వస్తువులను కిట్ ద్వారా అందిస్తున్నారు.
రూ. 34కోట్ల నగదు సాయం
రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్తోపాటు గర్భిణులకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేల చొప్పున సాయం చేస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి తొమ్మిదో నెల వరకు నాలుగు దశల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. 5-6 నెలల మధ్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చినప్పుడు రూ. 3వేలు, ప్రసవ సమయంలో బాబు జన్మిస్తే రూ. 2వేలు, పాప పుడితే రూ. 5వేలు ఇస్తారు. శిశువుకు మూడున్నర నెలల్లో టీకాలు వేస్తే రూ. 2వేలు, 9 నెలల సమయంలో టీకాలు వేయిస్తే రూ.3వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లను గర్భిణులకు సాయంగా అందించించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు
కేసీఆర్ కిట్ పథకంతో మాతా శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గర్భిణి సర్కారు దవాఖానలో చేరినప్పటి నుంచి ప్రసవానంతరం ఇంటికి వెళ్లేవరకు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ పథకం కింద నమోదైన వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండటంతోపాటు అన్ని రకాల మందులను అందిస్తున్నారు. దాంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 60 శాతం వరకు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఫలితంగా మాతాశిశు మరణాల సంఖ్య కూడా తగ్గింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం కోసం రూ.50 వేల రూపాయలు వసూలు చేస్తుండగా.. ప్రభుత్వాసుపత్రుల్లో చేరడం ద్వారా ఆ ఖర్చు కూడా తగ్గుతున్నది. దాంతో పాటు డెలీవరి తర్వాత అమ్మ ఒడి పథకం ద్వారా తల్లీబిడ్డను ఇంటి వద్దకు సురక్షితంగా తీసుకెళ్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు బాగున్నాయి
నేను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాను. సాధారణ ప్రసవం అయ్యింది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చినరు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎంతో బాగున్నాయి. డాక్టర్లు, నర్సులు కూడా మంచిగ వైద్యం చేశారు. గవర్నమెంట్ దవాఖానలను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేసీఆర్ కిట్లో అవసరమైన వస్తువులను అందించడం గొప్ప విషయం. నిరుపేదలకు కేసీఆర్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది.
–జనగాం సులోచన, తుక్కాపురం, భువనగిరి
నిర్విరామంగా కిట్ల పంపిణీ
జిల్లాలో కేసీఆర్ కిట్ల పంపిణీ నిర్విరామంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 20వేలు దాటింది. ఇంత మందికి అందించడం సంతోషంగా, గర్వంగా ఉంది. కిట్లతోపాటు రూ. 12వేల నగదును కూడా విడుతల వారీగా బ్యాంక్లో జమ చేస్తున్నాం. కేసీఆర్ కిట్తో సర్కారు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది. మాతాశిశు మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. డెలీవరి అయిన తర్వాత తల్లీబిడ్డను ఇంటి వద్దకు సురక్షితంగా డ్రాప్ చేయిస్తున్నాం.
– మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ, యాదాద్రి భువనగిరి
కేసీఆర్ కిట్లో అన్ని వస్తువులున్నయ్
ఇటీవల నేను మొదటి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన. కాన్పుకోసం 102 వాహనంలో తీసుకెళ్లినరు. వైద్యులు నార్మల్ డెలివరీ చేయినరు. పండంటి బిడ్డతో పాటు కేసీఆర్ కిట్ను ఒడిలో పెట్టినరు. నా బిడ్డకు అవసరమైన అన్ని రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ చాలా బాగుంది. నాకు రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేయడంతో పాటు బిడ్డకు అవసరమైన వస్తువులను కూడా ఇచ్చినరు. డెలివరీ తర్వాత మళ్లీ ఇంటికి తీసుకెళ్లి తోలివచ్చినరు.
– బొబ్బల సౌజన్య, ఆత్మకూరు(ఎం)