దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల పరిధిలో గల పేర్వాల ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతున్నది. వేసవిలోనూ మత్తడి దూకుతున్నది. మైనర్ ఇరిగేషన్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మించినా డిజైన్ లోపంతో చుక్క నీరూ చేరలేదు. ఫలితంగా ఆయకట్టుకు నీరందించే కాల్వలు పూడిపోయాయి. సీఎం కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి కాల్వల్లో పూడిక తీయించింది. డిండి ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంది. దాంతో పేర్వాల ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగు పోస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా పేర్వాల కొత్త చెరువు, రెంట చెరువుతోపాటు రూ.2.5 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ నిండుతున్నది. సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. నిత్యం కాల్వల్లో నీళ్లు రావడం, భూగర్భ జలాలు పెరుగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– పెద్దఅడిశర్లపల్లి/చందంపేట, మే 9
పెద్దఅడిశర్లపల్లి/ చందంపేట, మే 9 : అది పేరుకే ప్రాజెక్టు. నీళ్లు మాత్రం రావు.. ఆయకట్టు పారదు. చూసి మురవడమే తప్ప ఆ ప్రాంత ప్రజల దప్పిక తీర్చిన దఖాలాలు లేవు. ప్రాజెక్టు నిర్మించినా గత పాలకుల నిర్లక్ష్యంతో ఏండ్ల తరబడి వృథాగా ఉంది. వర్షం నీరు నిలువకపోవడంతో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. కాల్వలు కంపచెట్లతో మూసుకుపోయాయి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుకు మంచి రోజులొచ్చాయి. నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెచ్చింది. దాంతో ప్రాజెక్టు నిత్యం జలకళను సంతరించుకొని ఆయకట్టుకు సాగు నీరందిస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో సుమారు 50ఏండ్ల క్రితం పీఏపల్లి మండలంలోని పేర్వాల గ్రామ సమీపంలో ప్రాజెక్టును నిర్మించారు. వర్షపు నీటితో నిండే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2500 ఎకరాలకు రెండు కాల్వల ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించారు. కానీ.. అనుకున్న ఫలితం దక్కలేదు. ఈ ప్రాజెక్టుకు వాగు అడ్డుగా ఉండడంతో వర్షం నీరు ఇందులోకి చేరక నిరుపయోగంగా మారింది. ఏనాడూ నీళ్లు చేరక ఒట్టిపోయింది. కంపచెట్లు, జమ్ము మొలిచి కాల్వలు మూసుకుపోయాయి. మట్టితో పూడిపోయాయి. అయితే.. స్వరాష్ట్రంలో ఈ ప్రాజెక్టు ఉపయోగంలోకి వచ్చింది. మైనర్ ఇరిగేషన్కు ప్రాధాన్యమిచ్చిన సీఎం కేసీఆర్.. 416 ఎంకేఎఫ్ (మిలియన్ క్యూబిక్ ఫీట్స్) సామర్థ్యం కలిగిన పేర్వాల ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రాజెక్టు మరమ్మతులు చేయడంతోపాటు డిండి ఎత్తిపోతల జలాలు చేరేలా చర్యలు చేపట్టారు. దాంతో ప్రస్తుతం డిండి జలాలు మైనంపల్లి వాగు ద్వారా పేర్వాల ప్రాజెక్టులోకి చేరి నిత్యం నీటితో కళకళాలాడుతున్నది.
కాల్వల మరమ్మతులతో ఆయకట్టుకు నీళ్లు
పేర్వాల ప్రాజక్టు నుంచి రెండు కాల్వల ద్వారా 2500 ఎకరాలకు సాగునీరు అందించేలా అప్పట్లో డిజైన్ చేశారు. ఈ కాల్వల ద్వారా కొండమల్లేపల్లి మండలంలోని చెన్నంనేనిపల్లి, పేర్వాల, బచ్చాపురం, కొత్తపల్లి గ్రామాలతోపాటు పీఏపల్లి మండలంలోని అజ్మాపురం గ్రామ శివారులోని భూములకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలతో కాల్వలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయించింది. కాల్వలో పూడిక తీసి జమ్ము తొలగించడంతో పేర్వాల కొత్త చెరువు, రెంట చెరువులు నిండడంతోపాటు చివరి భూములకు నీళ్లు చేరుతున్నాయి. దాంతో పేర్వాల సమీపంలో భూగర్భజలాలు కూడా పెరిగాయి. బచ్చాపురం నుంచి కొత్తపల్లి వరకు 9 కిలోమీటర్ల కాల్వ, కొత్త చెరువు వరకు 4కిలోమీటర్ల మేర ఉన్న మరో కాల్వ పూడిక తీశారు. దీంతో వేసవిలో సైతం పేర్వాల జలాలు చెరువులోకి చేరుతున్నాయి.
ప్రాజెక్టు దిగువన చెక్ డ్యామ్ నిర్మాణం
పేర్వాల ప్రాజెక్టు నుంచి అలుగు పోసిన జలాలు వృథాగా కృష్ణా నదిలోకి చేరుతున్నాయి. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాజెక్టు దిగువన రెండున్నర కోట్లతో చెక్డ్యామ్ నిర్మించారు. దాంతో పేర్వాల ప్రాజెక్టు వృథా జలాలు వినియోగంలోకి రావడంతోపాటు పేర్వాల, చెన్నంనేనిపల్లి గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు భారీగా పెరిగి బోరుబావులు పుష్కలంగా పోస్తున్నాయి.
కాల్వ మరమ్మతులతో మా భూములకు నీళ్లొచ్చినయ్
గతంలో ప్రాజెక్టును పట్టించుకున్న పాపన పోలేదు. దాంతో కాల్వలో జమ్ము మొలిచి పూడిక పేరుకుపోవడంతో చుక్కనీళ్లు రాలేదు. తెలంగాణ సర్కారు వచ్చాక మరమ్మతులు చేపట్టడంతో డిండి ప్రాజెక్టు నుంచి పేర్వాల ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో నిత్యం మా చెరువులో నీళ్లు ఉంటున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరుబావులు పుష్కలంగా పోస్తున్నాయి.
– టేకులపల్లి అంజయ్య, పేర్వాల