దామరచర్ల, మార్చి 14 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో ఉన్న నందిబోడు పైన కాకతీయుల కాలం (సా.శ.13వ శతాబ్ది) నాటి శిథిల శివాలయం, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన ఇంజం నర్సిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శనివారం నాడు నందిబోడు పైనున్న శిల్పాలను గ్రామస్తుల సమక్షంలో పరిశీలించారు. శివాలయంలో చెట్లు, పుట్టలు పెరిగి గోడలు పడిపోయాయని, ఆలయం వెనుక వైపు నిర్మించిన తాత్కాలిక రేకు షెడ్డు కింద కాకతీయుల శైలి ఉట్టిపడుతున్న శివలింగం పానపట్టము, ముట్టె, చెవులు భిన్నమైన నంది, తల, కాళ్లు లేని అందంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు 700 సంవత్సరాల నాటి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, గ్రామ పెద్దలు పగిడిపాటి శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, రవీందర్ రెడ్డి, కందుల భిక్షారెడ్డి, పలసాని రామ్ రెడ్డి, పోటుపల్లి బాబు, ఉదయ్, సిరసాల సైదులు, నామా రవీందర్, ఆకారపు గోపాల్, మునగాల వెంకటరెడ్డి, ఇంకా శిల్పి బి.వెంకటరెడ్డి, పింగళి వెంకట నాగప్రసాద్ పాల్గొన్నారు.

కాకతీయుల కాలపు శిథిల శివాలయాన్ని పదిలపరచాలి : పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి