సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్13 : సర్వేల్ గురుకులం తన జీవితాన్ని మార్చేసిందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం సర్వేల్ గురుకులంలో డీజీపీ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఈ నెలలో డీజీపీగా రిటైర్డ్ అవుతున్నందున ఒక్కసారి తనకు విద్యాబుద్ధులు నేర్పిన సర్వేల్ గురుకులాన్ని సందర్శించాలనే కోరికతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. సర్వేల్ గురుకులంలో చదువడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఒకవేళ తాను ఇక్కడ చదువకపోయుంటే వ్యవసాయం చేసుకునే వాడినని తన మనసులో మాట చెప్పారు. 36 ఏండ్లు సమాజాన్ని ప్రభావితం చేసే ఉద్యోగంలో చేరేందుకు కారణం తాను చదివిన సర్వేల్ గురుకులమని గర్వంగా చెబుతున్నానని అన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. గురుకులంలో చదివిన ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, సైంటిస్టులు, లాయర్లు, ఇంజినీర్లు అయ్యారని గుర్తు చేశారు. సర్వేల్ గురుకులం అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న సేవలు అమోఘమన్నారు.
పలు నిర్మాణాల ప్రారంభం
అంతకు ముందు సర్వేల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాచకొండ సెక్కూరిటీ కౌన్సిల్, దివిస్ లేబోరేటరీ ఆధ్వరంలో రూ.20 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గది, అంగన్వాడీ భవనం, కిచెన్ రూమ్, టాయిలెట్లను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్తో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల, డీజీపీ మహేందర్రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
గ్రామస్తులు కోరిక మేరకు పాఠశాలను రూ.20 లక్షలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రాచకొండ షీటీం ఆధ్వర్యంలో మహిళలకు కుట్లు, అల్లికలు, టైలరింగ్లో శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ.. సర్వేల్ ప్రాథమిక పాఠశాల, గురుకులంలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని, తాను కూడా సర్వేల్ ప్రాథమిక పాఠశాలలో చదివినట్లు తెలిపారు. డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ ఉదయ్రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, ఎస్ఐ యుగేంధర్, సర్పంచ్ కట్టెల భిక్షపతి, ఎంపీటీసీలు యాదయ్య, పావని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.