స్వామికి ఘనంగా నిత్యపూజలు
యాదాద్రి, జూన్ 5 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధానాలయం, తిరువీధులు సందడిగా మారాయి. హరిహరుల దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి ధర్మ దర్శనాలకు 3గంటలు, ప్రత్యేక దర్శనాలకు 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. దర్శన అనంతరం స్వామి ప్రసాద కొనుగోలుకు భక్తులు బారులు తీరారు. కృష్ణ శిలా నిర్మాణాలు మహాద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.
ఆలయ ఘాట్రోడ్డు, పెద్దగుట్ట, రాయిగిరి చెరువు ప్రాంతంలోని గార్డెన్లలో భక్తులు సేదతీరారు. స్వయం భూ స్వామికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యోత్సవాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకించిన అర్చకులు తులసీదళాలను సమర్పించారు. నిత్యకల్యాణ వేడుకల్లో, సామూహిక వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.50,89,482 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీవారిని ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి నర్సింహారావు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కే.సురేందర్, ఆంధ్రప్రదేశ్ రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్రెడ్డి కుటుంబ సమేతం గా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చుకులు వారికి వేదాశీర్వచనం చేయగా అధికారులు వారికి స్వామి ప్రసాదం అందించారు.