2022 సంవత్సరం మార్చి 28 యాదగిరి గుట్ట చరిత్రలో లిఖించదగ్గ రోజు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో
లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించగా మహా కుంభ సంప్రోక్షణతో భక్తుల దర్శనానికి అందుబాటులోకి వచ్చిన శుభ దినం. రూ. 1,362 కోట్లతో ఆరేండ్లలోనే వివిధ కళాకృతులతో నిర్మించిన క్షేత్రం ఇల వైకుంఠపురంగా విరాజిల్లుతున్నది. విశాలంగా ప్రధానాలయంతోపాటు మాఢ వీధులు, పూజలు, వ్రతాలకు ప్రత్యేక భవనాలు, భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఒకప్పుడు ఏడాదికి పది లక్షలు సైతం దాటని భక్తుల సంఖ్య ఇప్పుడు కోటి దాటింది. ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఏడాదిలో స్వామి వారి ఖజానాకు రూ. 180 కోట్లు సమకూరాయి. దానితోపాటు హుండీ ఆదాయం రూ.30 కోట్లు, మిశ్రమ వెండి, బంగారం, విదేశీ కరెన్సీ భారీగానే వచ్చాయి. ఆలయ అందాలను చూసేందుకు, స్వామివారిని దర్శించుకొని తరించేందుకు భక్తులు మళ్లీ మళ్లీ రావడం గుట్టకు ఉన్న ప్రత్యేకతను తెలుపుతున్నది.
యాదగిరిగుట్ట, మార్చి 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష.. స్తపతుల కఠోర శ్రమ, వైటీడీఏ, దేవస్థానం అధికారుల పర్యవేక్షణ, ఆర్అండ్బీ పనితీరుతో యాదాద్రి దివ్యక్షేత్రం ఆరేండ్లలో పూర్తయింది. గతేడాది మార్చి 28న ఉదయం 11.55 గంటలకు మిథున లగ్న మూహూర్తాన దివ్య విమాన గోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ గావించి ఆలయాన్ని ప్రారంభించి మంగళవారంతో ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలా ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి.
పాత దేవాలయం, బాలాలయంలో ఉన్న సమయంలో రోజుకు కేవలం 5 నుంచి 10 వేల మంది, సెలవు దినాలతో పాటు శని, ఆదివారాల్లో 15 నుంచి 20 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేవారు. నిత్య రాబడి రూ.12 నుంచి 15 లక్షలు దాటేది కాదు. ఇక శని, ఆదివారాల్లో రూ. 20 నుంచి 25 లక్షలు వచ్చేది. ప్రధానాలయ పునఃప్రారంభమైన తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరుగుతూ వస్తుంది. తాజాగా రోజుకు 20 నుంచి 30 వేల మంది, సెలవు దినాలతో పాటు శని, ఆదివారాల్లో 50 నుంచి 60 వేల వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఆలయ పునఃప్రారంభం నాటి నుంచి 2023 మార్చి 27వ వరకు కోటి పది లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ పునఃప్రారంభం తర్వాత 2022-2023 సంవత్సరంలో అమెరికాతో పాటు, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మన్, న్యూజిలాండ్, యూరోప్, కెనడా, ఖతార్, సింగపూర్, స్కాట్లాండ్, కెనడా, సింగపూర్కు చెందిన విదేశీ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పూర్తి కృష్ణ శిలలతో ఆలయం పునర్నిర్మితం కావడంతో చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు యాదగిరిగుట్టకు తరలి వస్తున్నారు.
వరుసగా మూడేండ్ల ఆలయ ఆదాయాన్ని గమనిస్తే ఈ ఏడాది అధికంగా సమకూరినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2018-19లో రూ.99 కోట్ల పైచిలుకు రాగా 2020-21లో 125 కోట్లకు పైగా రాబడి వచ్చింది. ఇతర విభాగాలతో పాటు శాశ్వత పూజలు, అన్నదానంపై ఆదాయంతో వచ్చిన వడ్డీలతో కలిపి 2022 మార్చి 28 నుంచి 2023 మార్చి 25 వరకు రూ.180,96,21,812 ఆదాయం సమకూరింది.
దేవస్థానంలో స్వామివారికి అర్పించే బోగాలు, భక్తులకు అందజేసే ప్రసాదం, అన్నదానంలో పూర్తి ఆరోగ్యకరమైన ప్రమాణాలు పాటిస్తున్నారు. కొద్ది రోజుల్లో కేంద్రం ఇందుకు సంబంధించిన బోగ్(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) సర్టిఫికెట్ను అందజేయనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా సర్టిఫికెట్ను పొందిన దేవాలయంగా యాదాద్రి దివ్యక్షేత్రం నిలువనుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రం పునఃప్రారంభానంతరం జరుగుతున్న పనులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ తగు సూచనలు చేస్తూ వస్తున్నారు. 2022లో ఐదు దఫాలుగా సీఎం ఈ క్షేత్రాన్ని సందర్శించారు. గత సెప్టెంబర్ 30న సీఎం 21వ సారి స్వామివారిని దర్శించుకుని విమాన గోపురం స్వర్ణ తాపడానికి కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ. 52.48 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు.
భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 130 బస్సులు బస్టాండ్కు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి నేరుగా యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లేందుకు ఆలయ అధికారులు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. కొండకింద 2.57 ఎకరాల్లో రూ.17.38 కోట్లతో నిర్మించిన సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి 12 వేల మంది భక్తులు వ్రతం ఆచరించేలా నిర్మించారు. దీంతో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మిపుష్కరిణి, దీక్షాపరుల మండపం అందుబాటులోకి వచ్చాయి.
గతంతో పోలిస్తే ఆలయ పునః ప్రారంభానంతరం హుండీ ఆదాయం రెండింతలు పెరిగింది. రెండేళ్ల క్రితం రూ.10 కోట్లు ఉండగా, ఆలయ పునఃప్రారంభం తర్వాత రూ.30 కోట్లకు చేరింది. దీంతో పాటు మిశ్రమ వెండి, మిశ్రమ బంగారం సైతం పెరుగుతూ వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. గతంలో మూడు వారాలకు ఒకసారి హుండీ లెక్కించేవారు. తాజాగా రెండు వారాలకోసారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు విడిది చేసేలా ఆలయ నగరి రూపుదిద్దుకుంటుంది. దాతల సహకారంతో కాటేజీలను నిర్మిస్తున్నారు. 251 కాటేజీల నిర్మాణాలకు లే ఔట్ వేశారు. ఇప్పటికే 40 మంది దాతలు కాటేజీలు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. మరో పది మంది దాతలు వస్తే మొదటి విడతగా 50 కాటేజీల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.
కలిసొచ్చిన తొలి బ్రహ్మోత్సవాలు
గడిచిన ఫిబ్రవరి 21 నుంచి ఈ నెల 3 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. గతేడాది బ్రహ్మోత్సవాల కన్నా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో నిత్యాదాయం రూ.78,39,578 అధికంగా వచ్చింది. 2022లో బాలాలయంలో 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో రూ.1,55,07,309 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో రూ.2,33,46,887 నిత్యాదాయం సమకూరింది.
గతంతో పొలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఆలయ పునఃప్రారంభం అనంతరం ఏడాదిలో ఆలయ నిత్యాదాయం రూ.180 కోట్ల వరకు సమకూరింది. రెండింతలు హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి సకల సౌకర్యాలు అందిస్తున్నాం. మరిన్ని వసతులను కల్పించేందుకు పనులు కొనసాగుతున్నాయి.
– ఎన్.గీత, ఈఓ, యాదగిరిగుట్ట దేవస్థానం
స్వయంభూ నారసింహుడి ప్రధానాలయ పునఃప్రారంభ సమయంలో మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామివారి యంత్రానికి మూడు కోట్ల జపాలు చేపట్టాం. ఉత్సవంలో సైతం కోటి యాభై లక్షల జపాలు సాగాయి. నూతనాలయంలో అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం జరిపాం. సీఎం కేసీఆర్ అనుమతితో స్వామివారికి కోటి కుంకుమార్చన, మహాయాగాన్ని నిర్వహించనున్నాం. స్వామివారి క్షేత్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా వెయ్యి కోట్లతో, వెయ్యి విధాలుగా, వెయ్యి కళల మహా సమాహరంగా నారసింహుడి ఆలయాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ జన్మధన్యం. వారికి మా ఆశీస్సులు.
– నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధానార్చకుడు, యాదగిరిగుట్ట దేవస్థానం