మూడోరోజు మంగళవారం ఆలయంలో చంద్రపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుడి ఎదుట పసుపు, కుంకుమతో చంద్రపట్నం వేసి గంగాదేవి, కాటంరాజు, ఎర్రయ్య, యలమంచమ్మ, చౌడమ్మ తదితర 12దేవతల విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహించారు. మంత్రి జగదీశ్రెడ్డి కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్నారు. రెండు రోజులపాటు వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు పెద్దగట్టును సందర్శించగా మంగళవారం సూర్యాపేట, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. దాంతో గుట్టపైన, కింద భక్తుల రద్దీ కనిపించింది.
విడిది చేసేభక్తుల కంటే వచ్చిపోయే భక్తుల సంఖ్య అధికంగా ఉన్నది. ఉదయం కొంత జనం తగ్గినా సాయంత్రం భారీగా పెరిగింది. ఒక్కరోజే సుమారు ఐదు లక్షల మందికిపైనే భక్తులు సందర్శించారని అంచనా. జాతరలో దుకాణాల సముదాయాలు, అమ్యూజ్మెంట్ పార్కులు జనంతో కిటకిటలాడాయి. పిల్లలు, యువకులు ఫొటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. శానిటేషన్, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి.
– సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ)