నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవానికి ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అధికార యంత్రాంగం కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్, వాడపల్లి, వేములపల్లితోపాటు పలు కాల్వలు, చెరువుల వద్ద నిమజ్జనానికి విద్యుత్ లైట్లతో భారీ క్రేన్లు సిద్ధంచేసింది. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని వల్లభరావు చెరువులో 12 ఫీట్లలోపు, చర్లపల్లి చెరువులో ఆపైన ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఘనంగా శోభాయాత్ర చేపట్టనుండగా ఇప్పటికే స్వాగత వేదికలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. జిల్లాలో భద్రత కోసం 770 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనుండగా, 3,979 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగనున్నది.
– రామగిరి/నీలగిరి, సెప్టెంబర్ 26
రామగిరి/నీలగిరి, సెప్టెంబర్ 26 : నవరాత్రులు పూజలందుకున్న వినాయడికి బుధవారం వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర, నిమజ్జనానికి గణేశ్ ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు నిమజ్జనం చేసే ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో విద్యుద్దీపాలతోపాటు బారీకేడ్ల, క్రేన్లు ఏర్పాటు చేశారు. వీరితోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
తొలి పూజ హనుమాన్నగర్ గణపతి వద్దనే..
వినాయక నిమజ్జనోత్సవానికి తొలి పూజ పాతబస్తీ హనుమాన్నగర్లోని 1వ నంబర్ విగ్రహం వద్ద నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నేతి రఘుపతి, పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. అనంతరం శోభయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి శోభయాత్ర సాయంత్రం గడియారం సెంటర్కు చేరుకుంటుంది.
3,979 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
గణేశ్ శోభాయాత్రకు పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులు, వివిధ కాలనీల్లో మొత్తంగా 3,979 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటినీ జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందో బస్తును ఏర్పాటు చేశారు. నల్లగొండ పట్టణంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ లాంటి ప్రధాన పట్టణాల్లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు 24 గంటలు పర్యవేక్షిస్తారు.
భద్రత కోసం 770 మంది సిబ్బంది
గణేశ్ శోభయాత్రలో ఎస్పీ, ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 5 గురు ఆర్ఐలు, 40 మంది ఎస్ఐలతోపాటు 500 మంది పైగా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్, ఏఆర్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా ఒక్కో సబ్ డివిజన్కు 50 మంది చొప్పున మూడు డివిజన్లకు 170 మంది పోలీస్ వలంటీర్లను సైతం బందోబస్తులో భాగస్వాములను చేశారు. వీరితోపాటు ప్రత్యేక పోలీస్, ఫారెస్టు, అబ్కారీ శాఖల అధికారులను భాగస్వామ్యం చేశారు.
జిల్లా కేంద్రంలో స్వాగత వేదికలు
వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలిచ్చే గణనాథులను సాయంత్రం 5 గంటలకు గడియారం సెంటర్కు తీసుకొస్తారు. 12 ఫీట్లకుపై గా పెద్ద విగ్రహాలు హైదరాబాద్రోడ్డు మీదుగా చర్లపల్లిలోని భీమ సముద్రానికి తీసుకెళ్తారు. చిన్న విగ్రహాలు సావర్కర్నగర్ మీదుగా పానగల్ బైపాస్లోని వల్లాభరావు చెర్వుకు తరలించనున్నారు. విగ్రహాలకు స్వాగతం పలికేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్, సావర్కర్నగర్, ఎన్జీ కళాశాలతోపాటు పలు ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు.
శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి..
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోగల చర్లపల్లి భీమ సముద్రం, వల్లభరావు చెర్వు, వాడపల్లి, నాగార్జునసాగర్, దేవరకొండ, పెద్ద మునిగల్, డిండి, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, వేములపల్లి కాల్వల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఫ్లడ్ లైట్లు పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసింది.నిమజ్జన ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా సంఘటన జరిగితే జిల్లాలో ఏప్రాంతానికైనా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్ చేరుకోనే విధంగా ఏర్పాట్లు చేశారు.