యాదాద్రి భువనగిరి, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : చారిత్రక భువనగిరి కోట సకల హంగులతో అలరారనున్నది. ఏకశిల కొత్త సొబగులతో టూరిజం స్పాట్గా మారనున్నది. ఖిలా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు ఖర్చు చేయనుండగా, తొలి విడతలో రూ. 69 కోట్లు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన పనులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రెండేండ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.
భువనగిరి ఖిలా 147 ఎకరాల్లో విస్తరించి ఉంది. 610 మీటర్ల ఎత్తయిన ఈ కొండ తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరి కంటే ఎత్తయినది. అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది. కొండపైకి వెళ్లేందుకు ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. బస్సు, రైలు మార్గం అందుబాటులో ఉంది. సెలవు దినాల్లో ట్రెక్కింగ్ నడుస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో భువనగిరి కోట నిరాదరణకు గురైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ఖిలాకు గుర్తింపు దక్కింది. రూ.118 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు చేశారు. మొత్తం నాలుగు దశల్లో పనులు చేపట్టనున్నారు. నిధులు కూడా నాలుగు దశల్లో విడుదల కానున్నాయి. తొలి విడతలో భాగంగా 69 కోట్లు మంజూరు చేశారు. డీపీఆర్ రూపకల్పనను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల పలుమార్లు భువనగిరి కోటను సందర్శించి అధ్యయనం చేసి డీపీఆర్ను రూపొందించి.. ప్రతిపాదనలను ఫైనల్ చేసింది.
భువనగిరి ఖిలాపై అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. 10.73 కోట్లతో రోడ్ల అభివృద్ధి, పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తారు. రూ. 6.07 కోట్లతో ఎంట్రెన్స్ ప్లాజాను అప్గ్రేడ్ చేయడంతోపాటు సైట్ ఇంప్రూవ్మెంట్, పర్యాటక వసతులు కల్పించనున్నారు. రూ.4.30 కోట్లతో వారసత్వ కట్టడాల నిర్మాణ పనులు, రూ.12.18 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో, వసతుల కల్పనకు సుమారు రూ. 3 కోట్లు, ఐటీ ఇంటర్వేషన్కు రూ. 3.72 కోట్లు ఖర్చు చేయనున్నారు. రోప్ వే నిర్మాణానికి రూ.15.19 కోట్లు వెచ్చించనున్నారు.
పునరుద్ధరణలో భాగంగా అడ్వెంచర్ అనుభూతులు పొందేలా ఖిలాను అభివృద్ధి చేయనున్నారు. ఖిలాపై నీటి కొలను పునరుద్ధరించనున్నారు. రాప్పెలింగ్, రాక్ ైక్లెంబింగ్, హైకింగ్, వాల్ ైక్లెంబింగ్, పెయింట్ బాల్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, లిఫ్ట్ స్కైవాక్, ఓవర్నైట్ క్యాంపింగ్, మూన్లైట్ డిన్నర్ సదుపాయాలు కల్పించనున్నారు. ఖిలాపై ఉన్న జైలును ఇంటర్ప్రెటేషన్ సెంటర్గా మార్చనున్నారు. ఫోర్ట్ ఏరియాను అభివృద్ధి చేయడంతోపాటు రెస్టారెంట్గా తీర్చిదిద్దనున్నారు. ఇప్పుడున్న మెట్లను రెనొవేట్ చేయనున్నారు. గుట్టపై స్కల్పర్ గార్డెన్, రాక్ గార్డెన్, రోప్వే స్టేషన్, పార్కింగ్ ఏరియా, ఫుడ్ ప్లాజా, కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు.