కొండమల్లేపల్లి, డిసెంబర్ 31 : ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ.. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
అంతకు ముందు పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాల్సి ఉండగా.. కొన్ని గ్రామాల్లో అందడం లేదని, పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు సర్పంచులు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. వచ్చే వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రతి పేదవాడికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయించకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పస్నూరి సరస్వతమ్మ, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, తాసీల్దార్ దివ్వారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణూధర్రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మండల కోఆప్షన్ సభ్యుడు ఎంఏ సిరాజ్ఖాన్, మండలంలో ని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, అధికారులు పాల్గొన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలూనాయక్కు ఆదివారం వినతి పత్రం అందించారు. కార్యక్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎడమ సుమతమ్మా, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శోభ పాల్గొన్నారు.