చందంపేట, మార్చి 8 : చందంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పల్లె దవాఖాన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బొల్లారంలో సీసీ రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంబాలపల్లి, పొగిళ్లలో నిర్మిస్తున్న లిఫ్టు పూర్తయితే కంబాలపల్లి, రేకువలయం, పాత కంబాలపల్లి, పొగిళ్ల, సర్కిల్తండాల్లో సుమారు పది వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నట్లు తెలిపారు.
అనంతరం మండలంలోని దేవరచర్ల మునిస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బాలూనాయక్ పూజలు నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని, తాగునీటి వసతిని ఆయన ప్రారంభించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్వతీచందునాయక్, జాన్యాదవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, జడ్పీటీసీ బుజ్జీలచ్చిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.